గుడ్డుకు జై నిమ్మకు సై

9 Jul, 2020 06:33 IST|Sakshi

వానాకాలం సీజన్‌లోనూ వీటికి భలే డిమాండ్‌

నిమ్మలో పుష్కలంగా లభించే ‘సి’ విటమిన్‌  

కోడిగుడ్డులో బలవర్ధకమైన పోషకాహారం  

ప్రతి ఇంట్లోనూ పెరిగిన నిమ్మ, గుడ్డు వినియోగం        

కోవిడ్‌ వ్యాధిని నిలువరించేందుకు జనాల ప్రయత్నం

డిమాండ్‌ భారీస్థాయిలో ఉన్నా ధరలు అదుపులోనే

వేసవి కాలంలో నిమ్మకాయ ధరలుపెరగడం, కోడిగుడ్ల ధరలు తగ్గడంసాధారణమే. కానీ ప్రస్తుతం గ్రేటర్‌లోవీటి వినియోగం భారీగా ఉన్నప్పటికీ ధరలు అందుబాటులోనే ఉండటంగమనార్హం. కారణం నిమ్మకాయలవినియోగం వేసవిలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది వేసవిలో, వేసవిముగిసిన అనంతరంనిమ్మకాయల ధరలుపెరగలేదు.

సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల రోజువారీ మెనూలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. కోవిడ్‌ ఉపద్రవం ముంచుకొచ్చిన ప్రస్తుతతరుణంలో సరికొత్త ఆరోగ్య సూత్రాలకు ప్రాధాన్యం పెరిగింది. కరోనా మహమ్మారి బారిన పడకుండా గట్టి జాగ్రత్తలు అవసరమని సిటీజనులు భావిస్తున్నారు. రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దినసరి ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు, నిమ్మకాయ వచ్చి చేరాయి. నెల రోజులుగా గ్రేటర్‌ పరిధిలో నిమ్మకాయలు, కోడిగుడ్లవినియోగం విపరీతంగా పెరగడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలోవారానికి ఒకటి రెండు రోజులునిమ్మకాయ, కోడిగుడ్లు వినియోగించేవారు ప్రస్తుతం వీటిని ప్రతిరోజూ వాడుతున్నారు. కోడిగుడ్లను ఉడకబెట్టి తింటున్నారు. నిమ్మకాయలను జ్యూస్‌ చేసుకుని తాగుతున్నారు.కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు, వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు ఇదే సరైన విధానమని భావిస్తున్నారు. దీంతో నిమ్మ, కోడిగుడ్లకు డిమాండ్‌ భారీగా పెరిగింది. వేసవి కాలంలో నిమ్మకాయ ధరలు పెరగడం, కోడిగుడ్ల ధరలు తగ్గడం సాధారణమే. కానీ ప్రస్తుతం గ్రేటర్‌లో వీటి వినియోగం భారీగా ఉన్నప్పటికీ ధరలు అందుబాటులోనే ఉండటం గమనార్హం. కారణం నిమ్మకాయల వినియోగం వేసవిలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది వేసవిలో, వేసవి ముగిసిన అనంతరం నిమ్మకాయల ధరలు పెరగలేదు. వేసవి తర్వాత మామూలుగా వర్షాలు ప్రారంభమైతే జనం నిమ్మకాయల వినియోగం తగ్గిస్తారు. కానీ కరోనా విరుగుడుకు చాలా మంది నిమ్మకాయను వినియోగిస్తున్నారు. అయినా ధరలు మాత్రం అంతగా పెరగలేదు. రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ‘సి’ విటమిన్‌ ఎక్కువగా తీసువాలని జనం నిత్యం  నిమ్మకాయలను వినియోగిస్తున్నారు.

వర్షాకాలంలోనూ నిమ్మకు డిమాండ్‌
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ రోగ నిరోధకశక్తి పెంచుకునేందుకు ‘సి’ విటమిన్‌ బాగా లభించే నిమ్మకాయ వినియోగం పెంచారు గ్రేటర్‌వాసులు. అయినా ధరలు మాత్రం అంతగా పెరగలేదు. గ్రేటర్‌ పరిధిలో మార్కెట్లు, రైతు బజార్‌లతో పాటు దారుషిపా, చాదర్‌ఘాట్‌లోని  మార్కెట్‌లకు ఎక్కువ మోతాదులో నిమ్మకాయలు దిగుమతి అవుతున్నాయి. దీంతో గ్రేటర్‌ డిమాండ్‌కు సరిపడా ఇవి అందుబాటులో ఉండడంతో ధరలు పెరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్‌లో నిమ్మకాయల బస్తా ఒకటి రూ.600 నుంచి రూ.800 ఉందని, ప్రస్తుతం బస్తా రూ.250 నుంచి రూ. 350 వరకు ఉందని వ్యాపారులు అంటున్నారు. ఒక బస్తాలో దాదాపు 300 నుంచి 400 నిమ్మకాయలు ఉంటాయి.  

కోడిగుడ్లు సైతం భారీగా వినియోగం
వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవడానికి గ్రేటర్‌ ప్రజలు తమ రోజువారీ మెనూలో పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కోడ్ల వినియోగం పెరిగింది. కొన్ని రోజుల నుంచి గుడ్ల వినియోగం పెరిగిందని, ప్రస్తుతం జంట నగరాల్లో కోటి కోడిగుడ్ల మేరకు వినియోగమవుతున్నట్టు ఎగ్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌) అధికారులు అంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కోడిగుడ్ల ఉత్పత్తులు బాగానే ఉన్నాయని నెక్‌ వర్గాలు చెబుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో దాదాపు 80 వరకు ఉన్న పౌల్ట్రీఫారాలు చికెన్‌తోపాటు కోడిగుడ్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం చికెన్‌ వినియోగం కొంత తగ్గినా, గుడ్ల వినియోగం మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నట్టు పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.   

ధరలు అందుబాటులోనే..  
వేసవిలో తగ్గిన గుడ్ల ధరలు ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కోడిగుడ్డు ధర రూ. 3.60 పైసలు ఉండగా రిటేల్‌ మార్కెట్‌లో రూ. 4.50 పైసల వరకు ఉంది. గత వారం రోజులుగా గుడ్ల వినియోగం పెరిగిన ధరలు అంతగా పెరగలేదు. ప్రస్తుతం వర్షాకాలంలో గుడ్ల వినియోగం ఎక్కువగా ఉండదని భావించినా.. కరోనా ప్రభావంతో గుడ్లకు గతంలో ఎప్పుడూ లేనంతగా డిమాండ్‌ ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తి బాగానే ఉందని నెక్‌ అధికారులు అంటున్నారు.  

గత ఏడాది బస్తా నిమ్మకాయల ధర రూ.600– రూ.800  
ప్రస్తుతం రూ.250– రూ.350  
ఒక బస్తాలో 300– 400 నిమ్మకాయలు
హోల్‌సేల్‌లో కోడిగుడ్డు రూ.3.60 పైసలు  
రిటైల్‌ మార్కెట్‌లో రూ.4.50 పైసలు
నగరంలో రోజుకు కోటి కోడిగుడ్ల వినియోగం

మరిన్ని వార్తలు