సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో మరో ఘరానా మోసం బయటపడింది. కార్లు అమ్ముతామంటూ కోట్లు వసూలు చేసిన నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగ్జరీ కార్లను తక్కువ ధరకే అమ్ముతామంటూ ఈ గ్యాంగ్ 58 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 2008 నుంచి సాగుతున్న ఈ స్కామ్లో నిందితులు 262 మంది నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారు. కానీ 156 కార్లను మాత్రమే డెలివరీ చేశారు. మరో 106 మందికి డెలివరీ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.