మీ భద్రత మా బాధ్యత

4 Nov, 2019 08:53 IST|Sakshi

విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పోలీసుల భరోసా  

గచ్చిబౌలి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పూర్తి రక్షణ కల్పిస్తామని సైబరాబాద్‌ కమిషనర్‌ వీ.సీ.సజ్జనార్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పని చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉంటే తాము పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. అందుకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులు నిర్భయంగా విధుల్లో చేరవచ్చారు. విధుల్లో చేరే ఆర్టీసీ ఉద్యోగులపై బెదిరింపులు, భౌతిక దాడులకు పాల్పడితే  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లో చేరే వారిని ఎవరైనా ఉద్ధేశపూర్వకంగా అడ్డగించినా ఘెరావ్‌ చేసినా, బెదిరింపులకు పాల్పడినా వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. డయల్‌ 100, వాట్సాప్‌ నెంబర్‌ 949061744లలో ఫిర్యాదు చేయవచ్చన్నారు.– కమిషనర్‌ వీ.సీ.సజ్జనార్‌   

భయపెడితే క్రిమినల్‌ కేసులు
నేరేడ్‌మెట్‌: విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికులకు పోలీసు భద్రత కల్పిస్తామని రాచకొండ కమిషనర్‌ æమహేష్‌ భగవత్‌ అన్నారు.  ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పిలుపు నేపథ్యంలో కొన్ని రోజులుగా  సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల్లో ఎవరైనా నిర్భయంగా విధుల్లో చేరవచ్చన్నారు.  విధుల్లో చేరే  కార్మికులను ఎవరైనా భయపెట్టినా, ఇబ్బందులకు గురి చేసినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిచారు.ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగుల విధులకు ఆటంకం,  ప్రజలకు ఇబ్బందులు కలిగించడం చట్టప్రకారం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని సీపీ పేర్కొన్నారు.–రాచకొండ సీపీ, మహేష్‌భగవత్‌

అన్ని డిపోల వద్ద బందోబస్తు..
ముఖ్యమంత్రి పిలుపు మేరకు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న ఆర్టీసీ సిబ్బందికి అవసరమైన పూర్తి భద్ర త కల్పిస్తాం. అది మా బాధ్యతగా భావిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో ప్రతి డిపో వద్ద అవసరమైన బందోబస్తు ఉంటుంది. విధులను అడ్డుకోవడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆస్తులకు నష్టం కలిగించినా, ఉద్యోగులను అడ్డుకున్నా అరెస్టు చేస్తాం. –అంజనీకుమార్,నగర పోలీసు కమిషనర్‌ 

>
మరిన్ని వార్తలు