రూల్స్‌ పాటించకుంటే కేసులే..

22 May, 2020 09:29 IST|Sakshi

ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై సైబరాబాద్‌ పోలీసుల నజర్‌

రోడ్డు ప్రమాదాలపై ఎంవీ యాక్ట్‌ కింద చర్యలు

ఎల్‌ఎల్‌ను తీసుకొని రద్దు కోసం ఆర్టీఏకు లేఖ  

మూడు రోజుల్లో 18 వరకు కేసులు నమోదు

సాక్షి, సిటీబ్యూరో:  రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పెలియన్‌ రైడర్‌కు హెల్మెట్‌ లేకున్నా, వాహనాలకు సైడ్‌ మిర్రర్లు లేకున్నా ఈ–చలాన్లు జారీ చేస్తున్న వీరు.. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న లెర్నింగ్‌ లైసెన్స్‌(ఎల్‌ఎల్‌) వ్యక్తులపై దృష్టి సారించారు. ఎల్‌ఎల్‌ చేతికి వచ్చిన వెంటనే శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌ అన్నట్లుగా ఊహించుకుంటూ సరిగా డ్రైవింగ్‌ రాకుండానే రోడ్లెక్కి ప్రమాదాలకు కారణం అవుతున్నట్లుగా సైబరాబాద్‌ పోలీసుల అధ్యయనంతో తేలింది. వీరు చాలా వరకు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడంతో మోటారు వెహికల్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా  మూడు రోజులుగా ఇప్పటి వరకు 18 కేసులు నమోదు చేశారు. 

ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాం..
ప్రతిరోజూ వీరిపై నిఘా ఉంచి వారి ఎల్‌ఎల్‌ తీసుకొని నిబంధన ప్రకారం రద్దు కోసం ఆర్టీఏ అధికారులకు పంపిస్తాం. ‘లెర్నింగ్‌ లైసెన్స్‌ ఉన్న వ్యక్తి డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడూ అతడితో డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న వ్యక్తి ఉండాలనే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వాహనం ముందు, వెనక భాగంలో ఎల్‌ అనే ప్లేట్‌ను కూడా పెట్టుకోవడం లేదు. కొంతమంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ కూడా వాడటం లేదు. నేర్చుకుందామని రోడ్లపైకి వచ్చి నిర్లక్ష్యంగా నడుపుతున్నారు. ఇలా వివిధ ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అందుకే లెర్నింగ్‌ లైసెన్స్‌ వ్యక్తులపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాం.  
– విజయ్‌కుమార్, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ

మరిన్ని వార్తలు