అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి

23 Jun, 2018 01:09 IST|Sakshi
కృష్ణప్రసాద్‌ (ఫైల్‌ఫొటో)

షికాగోలోని అపార్ట్‌మెంట్‌లో అపస్మారక స్థితిలోకి కృష్ణప్రసాద్‌  

ఆస్పత్రికి తరలించేలోగా మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

హైదరాబాద్‌: అమెరికాలోని షికాగోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌వాసి అంబారిపేట కృష్ణప్రసాద్‌ (33) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ మేరకు అక్కడి పోలీసులు శుక్రవారం అతని తండ్రి రాంప్రసాద్‌కు సమాచారం అందించారు. అనంతరం రాంప్రసాద్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. రామంతాపూర్‌ శాంతినగర్‌కు చెందిన కృష్ణప్రసాద్‌ ఆరేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. షికాగోలోని హంటర్‌డ్రైవ్‌ అపార్ట్‌మెంట్‌–2ఏలో ఉంటూ విటెక్‌ కంప్యూటర్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

గురువారం అతని గది తలుపులు ఎంతకూ తెరుచుకోకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు గది తలుపులు తెరచి చూడగా కృష్ణప్రసాద్‌ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని రాంప్రసాద్‌ వివరించారు. అతనికి భార్య మైథిలి, కూతురు సాహితి, కుమారుడు అర్జున్‌ ఉన్నారు. భార్యాపిల్లలు ఇక్కడే ఉండగా.. కృష్ణప్రసాద్‌ ఒక్కడే షికాగోలో ఉంటున్నాడు. అతని మృతదేహాన్ని నగరానికి తరలించడానికి రెండుమూడు రోజులు పట్టవచ్చని బంధువులు తెలిపారు. కృష్ణప్రసాద్‌ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

మరిన్ని వార్తలు