చిల్లర రాజకీయాలు చేసే వాడిని కాదు

16 Dec, 2014 08:49 IST|Sakshi
చిల్లర రాజకీయాలు చేసే వాడిని కాదు

హైదరాబాద్: తాను వ్యక్తిగత విమర్శలు, చిల్లర రాజకీయాలు చేసే వాడిని కాదని టీఆర్ఎస్ నాయకుడు, ఖమ్మం జిల్లా నేత తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కేసీఆర్ కేబినెట్లో తుమ్మల పేరు ఖరారైంది. రాష్ట్ర మంత్రిగా మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించిన చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు. రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా తాను ముందుకు వెళ్తానని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తానని వెల్లడించారు.

ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో హయాంలో పలు కీలక మంత్రి పదవులు చేపట్టారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల్లో తెలంగాణలో తొమ్మిది జిల్లాలో తన పట్టు నిరుపించుకున్న టీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో మాత్రం ఆ పార్టీ చతికిల పడింది. దీంతో ఆ జిల్లాలో పట్టు సాధించేందుకు గులాబీ నేతలు రంగంలోకి దిగి... ఆకర్షణ మంత్రం చేపట్టారు.  అందులోభాగంగా ఖమ్మం జిల్లాలో టీడీపీకి ఆయువు పట్టు అయిన తుమ్మల ఆ పార్టీకి రాజీనామా చేసి.... కారు ఎక్కేశారు. ఈ రోజు జరిగే మంత్రి వర్గ విస్తరణలో తుమ్మలకు కేసీఆర్ కీలక శాఖ కేటాయించనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు