సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానని, పీసీసీ అధ్యక్ష పదవి అడిగితే తప్పేమిటని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టుగా, కొత్త పార్టీ పెడుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ పటిష్టతకు పనిచేస్తానన్నారు. కాంగ్రెస్లో అందరూ పీసీసీ, సీఎం పదవికోసం ప్రయత్నిస్తున్న వారేనని అన్నారు. 40 నుంచి 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తీవ్రంగా ఉందన్నారు. ఈ విషయం సీఎం కేసీఆర్కూ తెలుసునని, వారిని మార్చే అవకాశం ఉందని వెంకటరెడ్డి విశ్లేషించారు. ఒకవేళ వారిని మార్చకపోతే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.