జోరుగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

29 Aug, 2018 21:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్‌ అధికారుల బదిలీలకు తెరలేపింది. పోలీసు శాఖకు సంబంధించి జిల్లాల్లో కీలక బాధ్యతలలో ఉన్న తొమ్మిది మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనరేట్‌లో పరిపాలన విభాగం అడిషనల్‌ కమిషనర్‌గా శివప్రసాద్‌ను నియమించా రు. ఇప్పటివరకు ఇదే పోస్టులో ఉన్న మురళీకృష్ణను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని కార్‌ హెడ్‌క్వార్టర్‌ అదనపు కమిషనర్‌గా బదిలీ చేసింది. ఐదు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ పోస్టును భర్తీ చేసింది.

మరోసారి ఐఏఎస్‌ల బదిలీ 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. వ్యవసాయ శాఖ కమిషనర్‌ గా ఉన్న ఎం.జగన్‌మోహన్‌ ఈ నెల 31న రిటైర్‌ అవుతుండటంతో ఆయన స్థానంలో రాహుల్‌ బొజ్జాను, ధరణి ప్రాజెక్టు ప్రత్యేక అధికారి రజత్‌కుమార్‌ శైనినీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా నియమించిన డి.అమోయ్‌కుమార్‌ను ప్రభుత్వం ఒక్కరోజులోనే బదిలీ చేసింది.

ఆయనకు ఎక్కడ పోస్టింగ్‌ ఇచ్చిందీ ప్రస్తావించలేదు. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా పని చేస్తున్న భారతి హొళికెరి స్థానంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తూ బదిలీ అయిన కాట ఆమ్రపాలిని నియమించింది. భారతి హొళికెరిని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా, కరీంనగర్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఉన్న కె.శశాంకను జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం అదనపు బాధ్యతలతో ఈ పోస్టులో ఉన్న రోనాల్డ్‌రాస్‌ను రిలీవ్‌ చేశారు.

మరిన్ని వార్తలు