బాసర ట్రిపుల్‌ ఐటీలో అసాంఘిక కార్యకలాపాలు

26 Oct, 2019 11:58 IST|Sakshi

సాక్షి, బాసర : అసాంఘిక కార్యకలాపాలకు బాసర ట్రిపుల్‌ ఐటీ అడ్డాగా మారింది. చీకటి పడగానే విద్యార్థుల వసతి గృహాల సమీపంలో ప్రైవేట్ క్యాంటీన్ వద్ద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాసలీలలు సాగిస్తున్నారు. తాజాగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు ప్రైవేట్‌ వ్యక్తులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో ఒకరు నేపాల్‌ దేశానికి చెందిన వ్యక్తి కాగా, మరొకరు స్థానిక మహిళగా గుర్తించారు. వీరివురు ట్రిపుల్‌ ఐటీ ప్రైవేట్‌ క్యాంటీన్‌లో పనిచేసే వ్యక్తులుగా నిర్ధారించారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం క్యాంపస్‌ పరిధిలో ప్రైవేట్ క్యాంటీన్‌లు నడపకూడదన్న రూల్స్‌ అతిక్రమించి క్యాంటీన్‌ను నడుపుతున్నారు.

అనుమతులు లేకుండా నడపడం ఒక ఎత్తయితే.. వేరే దేశమైన నేపాల్ వ్యక్తిని కుక్‌గా పెట్టుకొని, ఇలాంటి చర్యలకు ఒడిగట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 7వేల మంది విద్యార్థులు చదివే ప్రదేశంలో, అందులోనూ పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఉన్న చోట ఇలాంటి సంఘటనలు జరగడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో తీస్తున్న సాక్షి కెమెరామెన్‌ నుంచి కెమెరా లాక్కొని మీడియా పట్ల బాసర ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తించారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తిని దాబాలో దారుణంగా హత్య చేశారు. ఆ కేసులో ఇప్పటికీ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. 

మరిన్ని వార్తలు