గుప్త నిధుల కోసం దేవాలయంలో తవ్వకాలు

27 Jul, 2015 18:05 IST|Sakshi

దేవరకొండ (నల్లగొండ జిల్లా) : గుప్త నిధుల కోసం గుర్తుతెలియని దుండగులు ముత్యాలమ్మ దేవాలయంలో తవ్వకాలు జరిపారు. ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని నసర్లబావి తండా సమీపంలో ఉన్న ముత్యాలమ్మ దేవాలయంలో జరిగింది. పురాతన దేవాలయం కావడంతో ఎన్నో ఏళ్లుగా చుట్టుపక్కల ఉన్న తండా వాసులు ముత్యాలమ్మను కొలుస్తున్నారు. ప్రతి ఏడాది దసరా సందర్భంగా గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జాతర నిర్వహిస్తుంటారు.

కాగా గుర్తుతెలియని దుండగులు గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాలలో చెట్టు కింద ఉన్న ముత్యాలమ్మ విగ్రహం స్వల్పంగా ధ్వంసమైంది. అయితే  సోమవారం అటుగా వెళ్లిన గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు