అక్రమాలకు ‘పదోన్నతి’!

26 Apr, 2019 02:18 IST|Sakshi

నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్‌... తాజాగా సహాయ కమిషనర్‌గా పదోన్నతి

దేవాదాయశాఖలో అడ్డగోలు ప్రమోషన్లు

సాక్షి, హైదరాబాద్‌: దేవాదాయశాఖలో వారి పోస్టింగే నిబంధనలకు విరుద్ధం... ఆ తర్వాత వారికి కల్పించిన పదోన్నతులు అక్రమం... వాటిని రద్దు చేయాలంటూ కొందరు ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు, పదోన్నతులు అక్రమంగా జరిగినందున వాటిపై పునఃసమీక్షించాకే కొత్త పదోన్నతులు ఇవ్వాలంటూ గతేడాదే నాటి దేవాదాయ శాఖ కమిషనర్‌ కూడా ప్రభుత్వానికి నివేదించారు. కానీ అక్రమాలను సరిచేయటం సంగతి అటుంచితే, ఇప్పుడు వారికి ఏకంగా సహాయ కమిషనర్‌ పదోన్నతి కల్పించేందుకు రంగం సిద్ధమైంది. ఉన్న పోస్టు నుంచి డిమోట్‌ కావాల్సిన వారు అసిస్టెంట్‌ కమిషనర్‌గా కీలక పోస్టులు పొందబోతున్నారు. కొన్నేళ్లుగా అక్రమాలకు నిలయంగా మారిన దేవాదాయ శాఖలో.. ఇప్పుడు మరో భారీ అక్రమ పర్వానికి తెరలేస్తోంది. ఈ శాఖకు పూర్తిస్థాయి కమిషనర్‌ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న ఓ అధికారి తెరవెనక చక్రం తిప్పి అక్రమ పదోన్నతులకు రంగం సిద్ధం చేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శాఖకు కొన్నేళ్లుగా ఇన్‌చార్జి కమిషనర్లే దిక్కయ్యారు. బిజీగా ఉండే ఆ అధికారులు, దేవాదాయ శాఖను పట్టించుకోకుండా తదుపరి అధికారులకు వదిలేస్తున్నారు. ఇప్పుడు అక్రమ పదోన్నతులకు రంగం సిద్ధం చేసి అక్రమార్కులకు కీలక పోస్టులు అప్పగించబోతున్నారు. వారం పది రోజుల్లో ఆర్డర్‌ కూడా వెలువడబోతోంది.  

అక్రమాలు ఇలా...
గతంలో ఐ.వెంకటేశ్వర్లు కమిషనర్‌గా ఉన్న సమయంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఆయన హయాంలో జరిగిన పదోన్నతులను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ సమయంలో అక్ర మంగా సూపరింటెండెంట్‌ పదోన్నతి పొందిన ఓ అధికారిపై చర్య తీసుకోలేదు. ఈ తప్పిదాన్ని తర్వాత గుర్తించిన కొందరు ఉద్యోగులు అ అధికారి పదోన్నతిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ కాసులతో ఉన్నతాధికారులను కొనేసిన ఆ అధికారి అక్రమ పదోన్నతిని కాపాడుకున్నారు. ఇప్పుడు అదే అధికారికి సహాయ కమిషనర్‌ పోస్టు కట్టబెట్టబోతున్నారు. అసలు ఈ అధికారి నియామకమే అక్రమమని, నిషేధం అమలులో ఉన్న సమయంలో అక్రమంగా నియమించబడ్డారని విజిలెన్స్‌ అధికారి విచారణ జరిపి నివేదిక ఇచ్చారు.  

 ఓ ప్రైవేట్‌ దేవాలయంలో సాధారణ క్లర్క్‌గా చేరి అక్రమంగా దేవాదాయ శాఖలోకి మారిన మరో చిరుద్యోగి 2008లో గ్రేడ్‌–2 ఈవో అయ్యారు. అది కూడా అక్రమమని, ఆయన 2011లోగానీ ఆ పోస్టుకు అర్హుడు కాదని విజిలెన్స్‌ అధికారి నివేదించారు. దీని ప్రకారం తర్వాత తీసుకున్న గ్రేడ్‌–1 ఈవో పదోన్నతి కూడా రద్దు కావాల్సిందేనని పేర్కొన్నారు. దాన్ని రద్దు చేసి ఆ అధికారిని డిమోట్‌ చేయాల్సింది పోయి ఇప్పుడు ఏసీ పోస్టు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.  2011లో గ్రేడ్‌–2 ఈవో పదోన్నతి పొందాల్సిన ఓ అధికారికి అక్రమంగా 2008లోనే కట్టబెట్టారు. ఇది అక్రమమని తర్వాత తేల్చారు. ఈ లెక్క ప్రకా రం 2014లో గ్రేడ్‌–1 ఈవో కావాల్సి ఉంటుంది. కానీ.. 2011లోనే గ్రేడ్‌–1 ఈవోగా భావిస్తూ అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టుకు సిద్ధం చేశారు.  

గత కమిషనర్‌ వద్దన్నా....
నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించడం దేవాదాయశాఖలో సాధారణ విషయంగా మారింది. దీనిపై గత రెండుమూడేళ్లలో ఫిర్యాదులు ఎక్కువగా రావడం, వీటిపై కోర్టు కేసులు పెరిగిపోవడంతో గత సంవత్సరం నాటి కమిషనర్‌ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 2006 నుంచి 2018 వరకు జరిగిన పదోన్నతుల ప్యానెళ్లను పునఃసమీక్షిం చి చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఆ తర్వాతే సీనియారిటీ జాబితా రూపొందించాల్సి ఉంటుందని  పేర్కొన్నారు. కానీ, దాన్ని అమలు చేయకుండా ఇప్పుడు మళ్లీ అడ్డగోలు పదోన్నతులకు తెరదీశారు.  

ఆ రెండు ఉత్తర్వులను పట్టించుకోరా...
దేవాదాయ శాఖలో పదోన్నతులు కల్పించేటప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 1478, 888లను అనుసరించాల్సి ఉంటుంది. కేడర్‌ స్ట్రెంథ్‌ (అనుమతి ఉన్న పోస్టుల సంఖ్య) ఆధారంగానే  దేవాలయంలో నియామకాలు జరపాలి. ప్రతి నియామకానికి నిర్ధారిత అర్హతలు ఉండాలి, ఒక పోస్టులో కనీసం ఐదేళ్లు (తర్వాత దాన్ని మూడేళ్లుగా మార్చారు) పనిచేయాలి. మళ్లీ అదే దేవాలయంలో పదోన్నతి పొందాలి. నియామకం సమయంలో ఎస్టాబ్లిష్‌మెంట్‌ చార్జీలు మొత్తం వ్యయంలో 30%కు మించరాదు. అంతకంటే మించితే కొత్త నియామకాలు జరపొద్దు. కానీ వీటిని పట్టించుకోకుండా నియామకాలు జరిపేస్తున్నారు,

అక్కడ అన్నీ వింతలే...
గత సంవత్సరం ఓ అధికారి డిప్యూటీ కమిషనర్‌ హోదాలో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత ఓ విచారణ నివేదిక వచ్చింది. దాని ప్రకారం ఆ అధికారికి అసలు డిప్యూటీ కమిషనర్‌ అర్హతే లేదు. 2011 లో గ్రేడ్‌–1 ఈవో కావాల్సిన ఆ అధికారి అక్రమంగా 2003లోనే ఆ పదోన్నతి పొందారు. అంటే 8 సంవత్సరాల ముందే దొడ్డిదారి పదోన్నతి పొందారన్నమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అక్రమంగా పదోన్నతి పొందుతూపోయారు, ఇప్పుడు రిటైర్‌ అయ్యారు. ఆయన బెనిఫిట్స్‌పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు