ఆర్టీసీకి సంక్రాంతి పండుగ

18 Jan, 2020 03:08 IST|Sakshi

వారం రోజులు.. రూ.94 కోట్ల ఆదాయం

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి రద్దీ ఆర్టీసీకి కాసులు కురిపించింది. సొంతూళ్లలో పండుగ జరుపుకునేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్లే దాదాపు 30 లక్షల మంది ప్రయాణికుల్లో సింహభాగం ఆర్టీసీపైనే ఆధారపడటం కలిసొచ్చింది. పెద్ద పండుగగా గుర్తింపు పొందిన సంక్రాంతి ప్రతీసారీ ఆర్టీసీ ఖజానాను కళకళలాడిస్తుంది. ఈసారీ రికార్డుస్థాయి ఆదాయం సమకూరటంతో ఆర్టీసీలో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నెల 9 నుంచి 16 వరకు ఆర్టీసీ రూ.94 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దాదాపు 4 వేల ప్రత్యేక బస్సులు తిప్పటం ద్వారా ఇంతపెద్ద మొత్తం సంపాదించింది.

ఇది గతేడాది సంక్రాంతి సమయంలో వచ్చిన ఆదాయం కంటే రూ.11 కోట్లు అధికం కావటం విశేషం. గతేడాది అదే తేదీల్లో రూ.83 కోట్లు ఆర్జించింది. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచటంతో ఈ భారీ తేడాకు ప్రధాన కారణం. తీవ్ర సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆర్టీసీ సరికొత్త చర్యలతో జనానికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేయటం కూడా మరో కారణంగా నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారి సంఖ్య పెరగటం దీనికి నిదర్శనం.

మరిన్ని వార్తలు