రేవంత్‌ రెడ్డి మామను విచారించిన ఐటీ అధికారులు

1 Oct, 2018 20:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత కొద్ది రోజులుగా రాజకీయ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు పొలిటికల్‌గా హాట్‌ అండ్‌ హీట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘ఓటుకు కోట్లు కేసు’ కు సంబంధించి జరిగిన సోదాల్లో పలు కీలకపత్రాలు, సమాచారం లభించిందని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో ఏ1 గా ఉన్న టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డితో సహా, అయన బంధవులకు, అనుచరులకు నోటీసులు జారీ చేసింది. దీనిలో భాగంగా రేవంత్‌ రెడ్డి మామ పద్మనాభ రెడ్డి సోమవారం ఐటీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. 

‘గత నెల 28న నా ఇంటిపై అధికారులు సోదాలు చేసి ఐటీ కార్యాలయాలకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. దానిలో భాగంగా విచారణ నిమిత్తం ఐటీ అధికారులు ముందు హాజరయ్యాను. రేవంత్‌ రెడ్డి ఆస్తులకు సంబంధించిన వివరాలు అడిగారు. దీంతో పాటు ‘ఓటుకు కోట్లు కేసు’ వివరాలు అడిగారు. ఆ వివరాలు నాకు తెలియదని చెప్పాను. రేవంత్‌ రెడ్డికి మా కూతురును ఇవ్వక ముందే నేను ఐటీ రిటర్న్స్‌ కట్టేవాడిని. ప్రస్తుతం రేవంత్‌ ఉంటున్న ఇల్లు నా కూతురుదే. మళ్లీ కొన్ని ప్రశ్నలతో కూడిన నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై ఈ నెల 20లోపు వివరణ ఇవ్వాలని ఐటీ అధికారులు కోరారు’అంటూ విచారణ వివరాలను పద్మనాభ రెడ్డి మీడియాకు తెలిపారు.  


 

మరిన్ని వార్తలు