బియ్యానికి రెక్కలు!

2 Feb, 2016 03:26 IST|Sakshi
బియ్యానికి రెక్కలు!

వచ్చే ఏడాదికల్లా రెట్టింపు కానున్న ధరలు?
సాక్షి, హైదరాబాద్: బియ్యం బంగారం కానుందా..? వచ్చే ఏడాదికల్లా బియ్యం ధరలు ఆకాశాన్ని తాకనున్నాయా..? ప్రస్తుతం రూ.42 నుంచి రూ.50 మధ్య ఉన్న సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యం సెంచరీ కొట్టనుందా..? తాజా పరిస్థితులు అందుకు అవుననే సమాధానమిస్తున్నాయి! ఏటేటా బియ్యం దిగుబడి ఊహించని విధంగా పడిపోతుండడంతో రేట్లు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఏటా మూడో వంతుకుపైగా బియ్యం దిగుబడి తగ్గిపోతోంది.

రెండేళ్ల కిందటితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో 36.02 లక్షల టన్నుల బియ్యం దిగుబడి తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే సమీప భవిష్యత్తులోనే బియ్యానికి తీవ్ర కొరత ఏర్పడనుంది. మార్కెట్లో ఖరీదైన నిత్యావసర సరుకుగా మారి జనాన్ని హడలెత్తించనుంది. రాష్ట్ర అర్థ గణాంక శాఖ సోమవారం విడుదల చేసిన ‘తెలంగాణ వ్యవసాయ గణాంకాల దర్శిని 2014-15’ ఇదే విషయాన్ని స్పష్టంచేసింది.

ఈ గణాంకాల ప్రకారం వరుసగా మూడేళ్ల పంట ఉత్పత్తులను పరిశీలిస్తే.. బియ్యం దిగుబడి తగ్గిన తీరు కళ్లకు కడుతోంది. 2013-14లో రాష్ట్రంలో 65.81 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అయింది. 2014-15లో ఇది ఒక్కసారిగా 45.45 లక్షల టన్నులకు పడిపోయింది. ఒకే ఏడాదిలో 20.36 లక్షల టన్నుల బియ్యం దిగుబడి తగ్గిపోవటం గమనార్హం.

 తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ వేసిన లెక్కల ప్రకారం ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వర్షాభావం, కరువుతో వరి సాగు నిరుటి కంటే గణనీయంగా తగ్గింది. 2015-16లో బియ్యం ఉత్పత్తి 29.79 లక్షల టన్నులకే పరిమితమవుతుందని అధికారులు ఇటీవల అంచనా వేశారు. అంటే నిరుటితో పోలిస్తే మరో 15.66 లక్షల టన్నులు తగ్గిపోనుందన్నమాట!

 బెంబేలెత్తిస్తున్న ధరలు
ఇప్పటికే మార్కెట్లో బియ్యం ధరలు సామాన్యులకు అందకుండా పోయాయి. మధ్య తరగతి కుటుంబీకులు, సంపన్నులకు సైతం దడ పుట్టిస్తున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం సూపర్ ఫైన్ బెస్ట్ క్వాలిటీ బియ్యం కిలో రూ.42 నుంచి రూ.50 మధ్య ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ధర 5 శాతం పెరిగినట్లు ప్రభుత్వమే నిర్ధారించింది. సూపర్ ఫైన్ సాధారణ రకం బియ్యం కిలో రూ.38 నుంచి రూ.42 మధ్య లభ్యమవుతోంది. గతేడాదితో పోలిస్తే ఇది 8 శాతం పెరిగింది.

సాధారణ రకం బియ్యం రూ.24 నుంచి రూ.25 ధరలో విక్రయిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ధరలో పెద్ద తేడా లేదు. కానీ తగ్గుతున్న బియ్యం ఉత్పత్తితో వచ్చే ఏడాది బియ్యం ధరలు ఏకంగా 90 శాతం వరకు ఎగబాకే ప్రమాదముందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కరువే కారణం..
తీవ్ర వర్షాభావంతో రాష్ట్రంలోని రైతులు వరి సాగుకు దూరమవుతున్నారు. అందుకే ఏటా వరి సాగు విస్తీర్ణం తగ్గిపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వేసిన వరి పంటను సైతం ప్రకృతి వైపరీత్యాలు వెంటాడాయి.

ఆహార ధాన్యాలన్నీ ప్రియమే
బియ్యంతో పాటు కరువు దెబ్బకు మిగతా పంట ఉత్పత్తుల దిగుబడి కూడా పడిపోయింది. రెండేళ్ల కిందటితో పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి సగానిపైగా తగ్గింది. 2013-14లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 106.86 లక్షల టన్నులుగా నమోదవగా.. ఈ ఏడాది 49.35 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేస్తున్నారు. గతేడాది 72.18 లక్షల టన్నులు ఉత్పత్తి అయినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. మక్కల (మొక్కజొన్న) దిగుబడి సైతం అదే స్థాయిలో తగ్గుముఖం పట్టింది.

 రెండేళ్ల కిందట 35.12 లక్షల టన్నులు, కిందటేడాది 23.08 లక్షల టన్నులుండగా.. ఈసారి కేవలం 16.19 లక్షల టన్నుల దిగుబడి మాత్రమే రావొచ్చని అంచనా వేశారు. చిరుధాన్యాల దిగుబడి కూడా.. గడిచిన అయిదేళ్ల సగటు కంటే తగ్గిపోయింది. 2013-14లో 102.21 లక్షల టన్నులున్న చిరుధాన్యాల ఉత్పత్తి కిందటేడాది 69.55 లక్షల టన్నులకు పడిపోయింది. ఈసారి అంతకంటే ఘోరంగా 46.85 లక్షల టన్నులకు పరిమితమైంది.

మరిన్ని వార్తలు