భారత్‌తో అమెరికా మైత్రికి ఉజ్వల భవిష్యత్తు

26 Jun, 2016 00:51 IST|Sakshi
భారత్‌తో అమెరికా మైత్రికి ఉజ్వల భవిష్యత్తు

అమెరికా విదేశీ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఏంజిలా ప్రైస్ అగ్లేర్
టీ హబ్ సందర్శన

 

హైదరాబాద్: భారత్‌తో అమెరికా మైత్రీ బంధానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అమెరికా దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఏంజిలా ప్రైస్ అగ్లేర్ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై హైదరాబాద్‌లో జరిగిన రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆమె శనివారం టీ హబ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. టీ హబ్‌లోని స్టార్టప్‌ల సీఈవోలతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్, అమెరికా సంబంధాలు ఇటీవలి కాలంలో బలోపేతం అయ్యాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి అమెరికా పర్యటన, అమెరికన్ కాంగ్రెస్‌లో ఆయన చేసిన చరిత్రాత్మక ప్రసంగం ఇరు దేశాల సంబంధాల్లో మైలురాయి వంటివని ఏంజిలా వ్యాఖ్యానించారు. భారత్‌తో సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా అత్యంత ఆసక్తితో ఉన్నారన్నారు. సైనిక, రక్షణ, ఇంధన, ఆర్థిక అంశాలు తదితరాల్లో భారత్‌తో తాము బలమైన సంబంధాలను కోరుకుంటున్నట్లు ఏంజిలా వెల్లడించారు. వాణిజ్య సంబంధాలపరంగా భారీ వృద్ధి సాధించే అవకాశం ఇరు దేశాలకు ఉందని ఆమె చెప్పారు. 130 కోట్ల జనాభాగల భారత్‌లో 40 శాతం మంది 20 ఏళ్ల లోపు వారే కావడం వల్ల భారీ ఆర్థిక వృద్ధిరేటుకు అవకాశం ఉందన్నారు. కేవలం ఏడాది వ్యవధిలో అమెరికాతోపాటు విదేశీ పెట్టుబడుల్లో హైదరాబాద్ 27 శాతం వృద్ధి రేటు సాధించడాన్ని ఏంజెలా ప్రస్తుతించారు.

 
బ్రెగ్జిట్ పరిణామాలపై ఆసక్తి

ప్రజాస్యామ్యాన్ని ముఖ్యమైన, సంక్లిష్టమైన వ్యవస్థగా పేర్కొన్న ఏంజిలా... ఈయూ నుంచి విడిపోయేందుకు బ్రిటన్ పౌరులు బ్రెగ్జిట్ పోలింగ్‌లో (రెఫరెండం) అనుకూలంగా ఓటు వేయడాన్ని  ఏంజెలా ప్రస్తావించారు. బ్రెగ్జిట్ పరిణామాలపై భారత్ తరహాలో తామూ ఆసక్తితో ఎదురుచూస్తున్నామన్నారు. అక్కడి వ్యవస్థ గాడిన పడేందుకు కనీసం రెండేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నామన్నారు. అణు సరఫరా బృందంలో ఇతర దేశాల వైఖరిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని.. అయితే సభ్యత్వం విషయంలో భారత్‌కు తమ మద్దతు కొనసాగుతుందని ఏంజిలా పునరుద్ఘాటించారు. వాతావరణ మార్పులపై పారిస్‌లో భారత్, అమెరికా సహా పలు దేశాల నడుమ కుదిరిన ఒప్పందాన్ని ఆచరణలోకి తేవడంపై దృష్టి సారించామన్నారు.

 

 ట హబ్ పనితీరు భేష్
టీ హబ్ పనితీరు అద్భుతంగా ఉందని ఏంజెలా కితాబిచ్చారు. ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా కాలిఫోర్నియాలోని ఐ హబ్‌తో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఆమె ప్రస్తావించారు. రెండు ప్రముఖ హబ్‌ల నడుమ కుదిరిన ఒప్పందం వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఔత్సాహికులకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. ఔత్సాహికులకు ప్రోత్సాహం, శిక్షణ , అభివృద్ధి, పెట్టుబడులు సమకూర్చడం ద్వారా టీ హబ్.. యువతకు కొత్త అవకాశాలు లభించేందుకు తోడ్పడుతుందన్నారు. 20 ఏళ్లుగా హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతోందని ఏంజెలా వ్యాఖ్యానించారు.

 

మరిన్ని వార్తలు