ఇండియా టుడే ర్యాంకింగ్‌లో మూడో ర్యాంక్‌

21 May, 2019 09:08 IST|Sakshi

ఇండియా టుడే ర్యాంకింగ్‌లో మూడో ర్యాంక్‌

హెచ్‌సీయూ వర్సిటీ కోర్సులకు ఎంతో డిమాండ్‌

‘సాక్షి’తో డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ వినోద్‌ పావరాల

రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌కు 30 ఏళ్ల చరిత్ర ఉందని ఆ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ వినోద్‌ పావరాల తెలిపారు. ఇండియా టుడే ర్యాంకింగ్‌లో హెచ్‌సీయూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌కు దేశంలోనే మూడో ర్యాంక్‌ వచ్చిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి పలు అంశాలు వెల్లడించారు. 1988లో ఆబిడ్స్‌లోని గోల్డెన్‌ «త్రెషోల్డ్‌లో స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత దీన్ని సరోజినీనాయుడు స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌గా నామకరణం చేశారన్నారు. ఇటీవలే 30 ఏళ్లు పూర్తి కావడం జరిగిందన్నారు. 2002లో గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ క్యాంపస్‌లోకి మారడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం పూర్తిస్థాయి సొంతభవనం ల్యాటరైట్‌తో రాతితో ఆకట్టుకునేలా భవనాన్ని డిజైన్‌ చేయడం జరిగిందన్నారు. సమష్టి కృషితోనే ఈ ర్యాంకింగ్‌ సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక్కడి కోర్సులకు పోటీ ఎక్కువ...  
ప్రారంభంలో మా డిపార్ట్‌మెంట్‌లో మాస్టర్‌ డిగ్రీలో కేవలం 15 నుంచి 20 మందిని మాత్రమే తీసుకొనేవాళ్లం. ప్రస్తుతం 40 మందిని వరకూ తీసుకుంటున్నామని తెలిపారు. ఇక్కడ కూడా 50 శాతం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి రిజర్వు చేశారని, మిగతా 50 శాతం ఓపెన్‌లో ఉంటాయన్నారు. ఈ ఏడాది నుంచి 10 సీట్లు ఈబీసీలకు కేటాయించామన్నారు. కానీ ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ప్రస్తుత ఏడాది నాలుగు సీట్లు (44) సీట్లు చేయడం జరిగిందని, వచ్చే ఏడాది మరో ఆరు సీట్లు పెంచి మొత్తం 50 సీట్లుగా మారుస్తామన్నారు. ప్రస్తుత ఏడాది 40 సీట్లకు 900 పైచిలుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.  ప్రవేశపరీక్ష నిర్వహించి అందులో 1:4 కింద ఇంటర్వ్యూకు పిలిచి 40 మందిని ఎంపిక చేస్తామన్నారు. అదే తరహాలో ప్రస్తుతం ఉన్న నాలుగు పీహెచ్‌డీ కోర్సులకు 160 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నార చెప్పారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటిని వారిలో 1:4 కింద ఇంటర్వ్యూకు ఎంపిక చేసి అందులో నలుగురికి పీహెచ్‌డీలో సీట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదట్లో టెలివిజన్‌ ప్రొడక్షన్‌ కోర్సును ప్రారంభించామని, ఆతర్వాత ప్రింట్‌ జర్నలిజమ్‌/న్యూ మీడియా, కమ్యూనికేషన్‌ మీడియా స్టడీ వంటి కోర్సులు సైతం నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడి కోర్సులు పూర్తి చేసినవారికి స్థానిక, జాతీయ స్థాయి చానళ్ళు, పేపర్లు, ఇతర వాటిల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి కోర్సులకు ప్రాధాన్యత పెరగడంతోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయన్నారు.

పూర్తి స్థాయి మౌలిక వసతులు
హెచ్‌సీయూలోని కమ్యూనికేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో పూర్తి స్థాయి మౌలిక వసతులున్నాయన్నారు. టీవీ స్టూడియో, కమ్యూనిటీ రేడియోస్టేషన్‌ ‘బోల్‌ హైదరాబాద్‌’, మల్టీ మీడియా ల్యాబ్‌ ఉన్నాయని, ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. ఫ్యాకల్టీ ఎక్కడికి వెళ్లినా అక్కడి నుంచి తరగతులు నిర్వహించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 11 మంది ఎంతో అనుభవం కలిగిన ఫ్యాకల్టీ ప్రతినిధులున్నారన్నారు. బోల్‌ హైదరాబాద్‌ 90.4 ఎఫ్‌ఎం రేడియో హెచ్‌సీయూ క్యాంపస్‌కు చుట్టూరా 15 నుంచి 20 కి.మీ. దూరం వరకు వస్తుందన్నారు.

మరిన్ని వార్తలు