రాజ్యాంగం గురించి యువత తెలుసుకోవాలి: గవర్నర్‌

26 Nov, 2019 11:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించిన సందర్భంగా ప్రతి ఏటా నవంబర్‌ 26న ఈ వేడుకలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ హై కోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహన్‌. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతోపాటు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం గాంధీ, అంబేద్కర్‌ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  

గవర్నర్‌ మాట్లాడుతూ..  దేశంలోని ప్రతీ పౌరుడికి మన రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను గుర్తు చేసుకుంటూ.. ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాజ్యాంగం కల్పిస్తున్న చట్టాల గురించి నేటి యువతకు పూర్తి అవగాహన లేదని, ప్రతి ఒక్కరూ తమ హక్కులు, విధుల గురించి తప్పని సరిగా తెలుసుకోవాలని సూచించారు. దేశ, రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని.. ఎన్నాళ్లు బతుకున్నామో కాదు.. ఎలా బతుకుతున్నామన్నదే ముఖ్యమన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. 

సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాజ్‌భవన్‌లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నందుకు గవర్నర్‌కు అభినందనలు తెలిపారు. భారత్‌ది డైనమిక్‌ రాజ్యాంగమని, అనేక మార్పులు, చేర్పులకు లోనైందని ప్రస్తావించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందన్నారు. రాజ్యాంగం 7 దశాబ్దలుగా పరిపుష్టంగా కొనసాగుతోందని, రాజ్యాంగ స్ఫూర్తితో మన కర్తవ్యాన్ని నిర్వహించుకుందాం. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు