బీసీ గురుకులాల్లో బయోగ్యాస్ ప్లాంట్లు: జోగురామన్న
సాక్షి, హైదరాబాద్: జనవరి 3 నుంచి 7 వరకు ఉస్మానియా వర్సిటీలో భారత సైన్స్ కాంగ్రెస్ 105వ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి 30 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు హాజరుకానున్నారన్నారు.
సోమవారం సచివాల యంలో మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి 9 జిల్లా కేంద్రాల్లో రూ.166.40 కోట్ల వ్యయంతో సైన్స్ సెంటర్లు, వరంగల్, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద రేడియేషన్ టెక్నాలజీ ప్లాంట్స్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సైన్స్ వ్యాప్తికోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా రూ.8.56 లక్షల వ్యయంతో బీసీ గురుకుల పాఠశాలల్లో 20 కిచెన్ వేస్ట్ ఆధారిత బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.