వేగంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం

7 May, 2018 07:32 IST|Sakshi
డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభిస్తున్న  మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 

బీర్కూర్‌(బాన్సువాడ) : కామారెడ్డి జిల్లాలో వేగంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర దేవాదాయ, గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా 3 వేల ఇళ్లు నిర్మాణంలో ఉండడం ప్రశంసనీయమన్నారు. మండలంలోని బైరాపూర్‌లో నిర్మించిన విఠల్‌ రుక్మిణి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు, గ్రామంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదివారం ఆయన హాజరయ్యారు.

ఆయనతోపాటు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ దఫేదర్‌రాజు, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌సింధేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయాలను దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు, పూజారులకు వేతనాలు చెల్లిస్తోందన్నారు. అలాగే గ్రామంలో నిర్మించిన 40 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు.

ఏ ప్రభుత్వాలు చేయని విధంగా సీఎం కేసీఆర్‌ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కామారెడ్డి జిల్లాలో 5138 ఇండ్లకు టెండర్‌ పూర్త యి, సుమారు 3 వేల ఇండ్లు నిర్మాణంలో ఉండడం ప్రశంసనీయమన్నారు. ముఖ్యమంత్రి ఆప్యాయంగా లక్ష్మీపుత్రుడు అని పిల్చుకునే వ్యక్తి మీ బాన్సువాడ ముద్దుబిడ్డ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో తాగు, సాగునీటికి కొరత లేదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నిజాంసాగర్‌కు పూర్వవైభవం వస్తుందన్నారు. మంత్రి పోచారం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆధ్యాత్మిక భావా లు కలి గిన వ్యక్తి అన్నారు. పండరిపురం తర్వాత అంతటి అద్భుత ఆలయాన్ని బైరాపూర్‌లో నిర్మించిన ఆల య కమిటీకి మంత్రి అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు