తెయూలో నియామకాలపై విచారణ..?

5 Apr, 2014 02:45 IST|Sakshi

 తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ యూనివర్సిటీలో చే పట్టిన టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలకు సంబంధించి వీసీ అక్బర్‌అలీఖాన్‌పై వెల్లువెత్తిన ఆరోపణలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్రంగా స్పందించారు. ఆరోపణలపై హైకోర్టు రిటైర్ట్ జడ్జి శ్రీరాములు నేతృత్వంలో కమిటీని నియమించినట్లు సమాచారం. ఈమేరకు శుక్రవారం సాయంత్రం ఉన్నత విద్యాశాఖను ఆదేశించినట్లు తెలిసింది. పాలకమండలి ఆమో దం లేకుండానే ఏకపక్షంగా అర్ధరాత్రి నియామకాలు జరపడంపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యాశాఖ నుంచి స్పష్టత తీసుకోకుండానే తెయూ వీసీ అక్బర్‌రాత్రికి రాత్రే చేపట్టిన నియామక ప్రక్రియ వి వాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

 జరిగింది ఇదీ...
 డిచ్‌పల్లి మండల కేంద్రం శివారులో ఉన ్న తెలంగాణ యూనివర్సిటీలో 103 బోధన, 7 బోధనేతర సిబ్బంది నియామకాలకు 2012, మే 25న నోటిఫికేషన్ వెలువడింది. 2012 అక్టోబర్- నవంబర్ నెలలో హైదరాబాద్‌లోని వ్యవసాయ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలను స్థానికంగా నిర్వహించకుండా హైదరాబాద్‌లో నిర్వహించడంపై వీసీపై అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నియామకాల్లో అర్హతలు లేనివారికి కాల్‌లెటర్లు పంపించారని, రోస్టర్ పాయింట్లు పాటించలేదని, పలువురు అభ్యర్థుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

అయినా ఇవేమీ పట్టించుకోకుండా వీసీ మొండిగా నియామకాలను చేపట్టారు. ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన 54 మందికి 2013, ఫిబ్రవరి 1న నియామక పత్రాలు అందజేశారు. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ విషయమై అప్పటి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ  ఆగ్రహం వ్యక్తం చేయడంతో నియామకాలను నిలిపివేశారు. వీటన్నింటిపై విద్యార్థిసంఘాలు, అకడ మిక్ కన్సల్టెంట్లు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మిన్నీ మాథ్యూతో పాటు ఉన్నత విద్యామండలి అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం నియామకాలను నిలిపివేస్తూ, ఆరోపణలపై ద్విసభ్య విచారణ కమిటీని నియమించింది.

 ఆంధ్రా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రసాద్‌రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భాస్కర్‌రావును కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ ద్విసభ్య కమిటీ విచారణ జరిపి నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందజేసినట్లు సమాచారం. అదే సమయంలో కోర్టు సైతం నియామక ప్రక్రియను నిలిపివేయాలని 2013, మార్చి13న స్టే ఇచ్చింది. దీంతో ఈ ఏడాది జనవరి 3న హైకోర్టు స్టే ఎత్తివేసింది. ఈ సమాచారం సాయంత్రం వర్సిటీ అధికారులకు అందింది. స్టే తొలగింపు సమాచారం అందిన వెంటనే వీసీ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ లింబాద్రిలు హుటాహుటిన అదేరోజు అర్ధరాత్రి వర్సిటీ పరిపాలనా భవనానికి చేరుకుని నియామక పత్రాలను సిద్ధం చేశారు.  54 మంది అభ్యర్థులకు సమాచారం అందజేసి వర్సిటీకి పిలిపించుకున్నారు. వీరిలో 48 మంది విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఈ నియామకాలకు వర్సిటీ పాలక మండలి అనుమతి లభించలేదు. దీంతో విధుల్లో చేరిన బోధన సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో రెండు నెలల పాటు జాప్యం చేశారు. ఇప్పటికీ కొత్తగా విధుల్లో చేరిన అధ్యాపకులు ఇంకా అభద్రతా భావంతోనే పనిచేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు