నిఘా.. నిద్ర

20 Sep, 2014 03:09 IST|Sakshi
నిఘా.. నిద్ర

ఓ వైపు రాయచూర్- హైదరాబాద్ జాతీయ రహదారి. మరోవైపు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలను కలిపే రైలుమార్గం. కృష్ణా, భీమా నదుల సంగమం. ఇంకేం అంతర్ రాష్ట్ర సరిహద్దులోని భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. పేలుడు పదార్థాలు, కల్లు రవాణా, మట్కా, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు అడ్డు లేకుండా పోయింది. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో మునిగి తేలుతోంది. రవాణా, వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు లేకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది.
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :
 కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మాగనూరు మండలంలోని పలు గ్రామాలు కేంద్రంగా అక్రమ దందా జోరుగా సాగుతోంది. కృష్ణా రైల్వే స్టేషన్ అడ్డాగా కల్లు వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. కృష్ణా రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న కల్లు విక్రయ కేంద్రానికి కర్ణాటక నుంచి మద్యం ప్రియులు రైళ్ల ద్వారా చేరుకుంటున్నారు. ఇక్కడ కల్లు సేవించడంతో పాటు ట్యూబులు, క్యాన్ల ద్వారా అక్కడకు కల్లు తరలిస్తున్నారు. ఈ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతున్నా ఎక్సైజ్ విభాగం అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కల్తీ కల్లు తయారీలో వినియోగించే క్లోరల్ హైడ్రేట్ రైలుమార్గం ద్వారా మహారాష్ట్ర నుంచి స్థానిక వ్యాపారులకు సరఫరా అవుతోంది. కృష్ణా నదీ తీరం వెంట అనుమతి లేకుండా క్వారీలు నిర్వహిస్తున్నారనే పిర్యాదులున్నాయి. ఈ క్వారీల్లో వినియోగించే పేలుడు పదార్థారాలు కూడా మహా రాష్ట్ర నుంచి రైలుమార్గంలో తరలివస్తున్నాయి. టై రోడ్ పరిసర ప్రాంతాలు జూదం కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. పొరుగునే ఉన్న రాయచూరు థర్మల్ విద్యుత్ కేంద్రం పరిసర గ్రామాల నుంచి వచ్చే పేకాట రాయుళ్లకు స్థానికంగా కొందరు అడ్డా సమకూర్చుతున్నారు. ‘అందర్- బాహర్’ మొదటి పేజీ తరువాయి
 పేరిట లక్షల రూపాయల్లో జూదం కొనసాగుతుండగా స్థానిక ముఠాలకు రోజూ రూ.వేలల్లో ఆదాయం సమకూరుతోంది. కృష్ణా రైల్వే స్టేషన్ సమీపంలోనే ఓ రెండు దుకాణాలు కేంద్రంగా మట్కా కొనసాగుతోంది. బహిరంగంగానే బెట్టింగులు జరుగుతున్నా అరికట్టే దిశగా చర్యలు తీసుకున్న దాఖలా లేదు. కృష్ణానదికి అవతలి ఒడ్డున ఉన్న కర్ణాటక నుంచి మాగనూరు మండల పరిధిలోని గ్రామాలకు మద్యం సరఫరా అవుతోంది. పర్యవేక్షణ లేకపోవడంతో ఎంఆర్‌పీతో సంబంధం లేకుండా ఎక్కువ ధరలకు మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.
 ప్రభుత్వ ఖజానాకు గండి
 రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన రాయచూర్-  హైదరాబాద్ మార్గంలో కీలక వి భాగాలకు చెందిన చెక్‌పోస్టులు కనిపిం చడం లేదు. వ్యవసాయ, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ చెక్‌పోస్టులు మాత్రమే ఉన్నా యి. కీలకమైన రవాణా, వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు ఇంకా ఏర్పాటు చేయలేదు. దీంతో సరైన అనుమతి పత్రాలు లేకుండానే కర్ణాటక- తెలంగాణ రాష్ట్రాల నడుమ వాణిజ్య సరుకుల రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సిమెంటు, ఇనుము, బొగ్గు, ఇసుక తదితరాలు ఎలాంటి అనుమతి లేకుండానే రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నాయి. ప్రొహిబిషన్, ఎక్సైజ్ విభాగానికి చెందిన చెక్‌పోస్టున్నా అది శిథిలావస్తకు చేరింది. షెడ్డులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది సతమతమవుతున్నారు.



 

మరిన్ని వార్తలు