బీజేపీ బంద్‌ ప్రశాంతం

3 May, 2019 11:23 IST|Sakshi
హన్మకొండలో ర్యాలీగా వెళ్తున్న రాజేశ్వర్‌రావు, ధర్మారావు, నాయకులు

హన్మకొండ: ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనం, ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు అర్బన్‌ జి ల్లాలో గురువారం బంద్‌ ప్రశాంతంగా జరిగింది. బంద్‌ సందర్భంగా అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉం డేలా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పలువురు బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. అయి తే, పలువురు నాయకులు ర్యాలీలుగా వెళ్తూ తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌ రెడ్డి ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు ఉదయమే హన్మకొండలోని ఆర్టీసీ జిల్లా బస్‌స్టేషన్‌కు చేరుకుని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

ఈమేరకు పోలీసులు చేరుకుని రాకేష్‌ రెడ్డితో పాటు నాయకులను సుబేదారి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ టి.రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ర్యాలీ తీశారు. అక్కడక్కడా తెరిచి ఉన్న దుకాణాలను మూయిస్తుండగా రాజేశ్వర్‌రావు, ధర్మారావు, రావుల కిషన్‌తో పాటు ఇతర నాయకులను అరెస్టు చేసి సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఇక హంటర్‌ రోడ్డు మీదుగా బంద్‌ను పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రి డాక్టర్‌ గుండె విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్‌ ఎంపీ అభ్యర్థి చింత సాంబమూర్తిని అరెస్టు చేసి హన్మకొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇక జిల్లాలోని మిగతా మండలాల్లోను బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాల్లో నాయకులు వంగాల సమ్మిరెడ్డి, చింతలఫణి అమరేందర్‌రెడ్డి, రావు అమరేందర్‌రెడ్డి, కొలను సంతోష్‌రెడ్డి, కందగట్ల సత్యనారాయణ, రాజేంద్రప్రసాద్, వినోద్, కోటేశ్వర్, మహేష్‌గౌడ్, రవి నాయక్, పెరుగు సురేష్, రాజేష్‌ ఖన్నా, శేఖర్‌ పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యమా.. రాచరిక రాజ్యమా?
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది... ప్రజాస్వామ్యమా, రాచరిక రాజ్యమా అని మాజీ మంత్రి గుండె విజయరామారావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి ప్రశ్నించారు. ఇంటర్మీడియేట్‌ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బంద్‌కు పిలుపునివ్వగా పోలీసులను ముందు పెట్టి నిరసనలు తెలపకుండా అడ్డుకోవడం గర్హనీయమన్నారు. బీజేపీ రాష్ట్ర అ«ధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ నిమ్స్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వ లక్ష్మణ్‌కు ఏం జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ టి.రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ ఇంటర్‌ పరీక్షలు విద్యార్థులకు జవాబు పత్రాల జిరాక్స్‌ ప్రతులను అందించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు