నేనున్నానని.. నీకేం కాదని

19 Feb, 2020 09:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నేలకొండపల్లి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు, బాగా చదువుకునేందుకు వారి ఆటంకాలను అధిగమ విుంచేలా ప్రోత్సహించేందుకు సరికొత్త విధానం అమలు చేస్తున్నారు. మనోధైర్యన్ని నింపి, వారిని మానసికంగా దృఢంగా చేసేందుకు రాష్ట్ర ఇంటర్‌ బోర్డు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పరీక్షలు, ఫలితాల భయం, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై బలవన్మరానికి పాల్పడకుండా..మేమున్నామంటూ..వ్యక్తిత్వ వికాసంతో వారిలో ధైర్యం నూరిపోయనున్నారు. కళాశాలలోని సీనియర్‌ అధ్యాపకులే కౌన్సిలర్ల మాదిరి వ్యవహరించేలా, పిల్లలకు చేయూతనిచ్చేలా ఇప్పటికే ఇంటర్మిడియట్‌ బోర్డు శిక్షణ కూడా ఇవ్వడంతో వారంతా సిద్ధంగా ఉన్నారు. ఫలితంగా జిల్లాలోని 19 జూనియరల్‌ కళాశాలల్లో వీరు తమ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

కౌన్సిలర్లు ఏం చేస్తారంటే..?
అధైర్య పడొద్దు.. చక్కగా చదవాలి
విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా వారిని మానసికంగా సిద్ధం చేస్తారు. తక్కువ మార్కులు వస్తే సబ్జెక్ట్‌ ఆధ్యాపకుడితో కౌన్సిలర్‌ మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. లోపాలు వివరించి, అధిగవిుంచేందుకు పాటించాల్సిన పద్ధతులను తెలిపి వెన్నుతడతారు. తల్లిదండ్రులను కళాశాలకు పిలిచి..తగిన సూచనలు చేస్తారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా కుంగిపోవద్దని ధైర్యం నూరిపోస్తారు.  సానుకూల దృక్పథం, స్థిర ఆలోచనలనుపెంచుకునేలా మారుస్తారు. 

కుటుంబ పరిస్థితిపై సునిశిత పరిశీలన..
 పిల్లలతో వ్యక్తిగతంగా మాట్లాడి.. కుటుంబ నేపథ్యం తెలుసుకుంటారు.  ఆర్ధిక పరిస్థితులు, చదువులో ఎలా ఉన్నారు? అనేది ఓ అంచనాకు వస్తారు. వివిధ పరీక్షల్లో సాధించిన మార్కులు, ఏ సబ్జెక్ట్‌ లో వెనకబడ్డారు? అనే విషయాలను కూలంకశంగా తెలుసుకుంటారు.  కాలేజీకి రాకుంటే..కారణాలు తెలుసుకుని పునరావృత్తం కాకుండా సూచనలు చేస్తారు. 

విద్యార్థులతో భేటీ
 కళాశాలల్లో రోజు వారి కార్యక్రమాలతో పాటు పిల్లలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు.  అధిక మార్కులు సాధించేందుకు మెళకువలు వివరిస్తారు. జ్ఞాపకశక్తి పెంపు, పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి..అనేతదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. ప్రతి విద్యార్థితో వ్యక్తిగతంగా మాట్లాడతారు. 

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు-19
కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ఎంపికైన సీనియర్‌ అధ్యాపకుల సంఖ్య- 19

రోజూ కౌన్సెలింగ్‌..
ప్రతిరోజూ కాలేజీకి రాగానే విద్యార్థుల పరిస్థితులను గుర్తిస్తాను. ఎవరైతే డల్లుగా ఉంటారో, మానసిక ఒత్తిడికి గురవుతుంటారో వారిలో ధైర్యాన్ని నింపే విధంగా కౌన్సెలింగ్‌ చేస్తున్నా. ఇందుకు తగ్గట్టుగా మానసిక నిపుణులు నాకు..వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇచ్చారు. ఆ తరహాలోనే విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నా.
వై.సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్, నేలకొండపల్లి

మనోధైర్యాన్ని కలిగించేందుకే..
మానసిక ఆందోళన, ఒత్తిడి అనేది విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తద్వారా క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిని అధిగవిుంచేందుకు ఇంటరీ్మడియట్‌ బోర్డు కౌన్సిలర్లను నియమించింది. ఆత్మ విశ్వాసం పెంపోందించడమే దీని లక్ష్యం. 
– రవిబాబు, డీఐఓ, ఖమ్మం

మార్పు కనిపిస్తోంది..
మా కాలేజీలో ఏర్పాటు చేసిన కౌన్సిలర్‌ ప్రతిరోజూ డల్‌గా ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. వారిలో ధైర్యం నింపుతున్నారు. పిల్లలు చాలా ఫ్రీగా, నమ్మకంగా విషయాలను వివరించగలుగుతున్నారు.         
– ఎస్‌ఎన్‌.శాస్త్రి, ప్రిన్సిపాల్, నేలకొండపల్లి

>
మరిన్ని వార్తలు