ఇంప్రూవ్‌మెంట్‌ ఉన్నట్టా.. లేనట్టా?  

29 May, 2019 02:09 IST|Sakshi

గందరగోళంలో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులు 

ఎటూ తేల్చని ఇంటర్‌ బోర్డు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల రీవెరిఫికేషన్‌లో ఉత్తీర్ణులైన ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం పరీక్షలు రాసే అవకాశం ఇస్తుందా? లేదా? అన్న గందరగోళం నెలకొంది. ఇంటర్‌ ఫలితాల్లో తప్పుల కారణంగా కొంతమంది విద్యార్థులు ఫెయిల్‌ కాగా, మరికొంత మందికి తక్కువ మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా, ఫెయిలైన 3.82 లక్షల మంది జవాబు పత్రాలను బోర్డు రీవెరిఫికేషన్‌ చేసింది. దీంతో ద్వితీయ సంవత్సర విద్యార్థులు 552 మంది ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు కొంతమంది పాసైనా తక్కువ మార్కులు రావడంతో రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా వారి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. అయితే వారిలో కొందరు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలని భావిస్తున్నారు. వారికి ఇప్పుడు బోర్డు అవకాశం ఇస్తుందా? లేదా? అన్నది తేల్చడం లేదు.

బోర్డు పొరపాట్ల కారణంగా తాము ఫెయిల్‌ అయ్యామని, మరికొంత మందికి తక్కువ మార్కులు వచ్చాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఈ నెల 7 నుంచి జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బోర్డు అధికారులు మాత్రం సెకండియర్‌ విద్యార్థుల్లో ఇంప్రూవ్‌మెంట్‌ రాసేవారు అరుదేనని చెబుతున్నారు. ఒకవేళ ఇంప్రూవ్‌మెంట్‌లో ఆ విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిలైనా అవే మార్కులు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న మార్కులు కోల్పోతారు కాబట్టి సెకండియర్‌ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలకు హాజరుకారని చెబుతున్నారు.  

585 మందికి అవకాశం.. 
ఇంటర్‌ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయి, రీవెరిఫికేషన్‌లో ఉత్తీర్ణులైన 585 మంది విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు ఇంప్రూవ్‌మెంట్‌ రాసే అవకాశం కల్పించింది. ప్రథమ సంవత్సర విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌ రాస్తే ఎందులో ఎక్కువ మార్కులు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి వారికి మాత్రం ఈ నెల 7 నుంచి జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు.   

మరిన్ని వార్తలు