మిషన్‌ కాకతీయకు అంతర్జాతీయ గుర్తింపు 

25 Jul, 2019 01:36 IST|Sakshi

ఇండోనేసియా సదస్సులో ప్రజెంటేషన్‌ కోసం రాష్ట్రానికి ఆహ్వానం

నీటిపారుదలశాఖకు డబ్ల్యూఐఎఫ్‌3 సంస్థ లేఖ

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్‌ కాకతీయ పథకానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇండోనేసియాలోని బాలిలో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో ఈ పథకంపై ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు రావాల్సిందిగా థర్డ్‌ వరల్డ్‌ ఇరిగేషన్‌ ఫోరం (డబ్ల్యూఐఎఫ్‌3) ప్రతినిధి విజయ్‌. కె.లబ్సెత్వార్‌ నుంచి ఇరిగేషన్‌ శాఖకు లేఖ అందింది. ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజీ సంస్థ (ఐసీఐడీ) ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. మిషన్‌ కాకతీయపై సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, చిన్న నీటివనరుల ఎస్‌ఈ కె.శ్యాంసుందర్‌లు రాసిన సాంకేతిక పత్రం ఈ సదస్సులో సమర్పించేందుకు ఆమోదం పొందింది.

అలాగే ఆన్‌ ఆఫ్‌ పద్ధతి ద్వారా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో నీటి నిర్వహణ అభివృద్ధి గురించి, ఎస్సారెస్పీలో నీటి సమర్థ వినియోగం గురించి రాసిన సాంకేతిక పత్రాలు కూడా సదస్సు ఆమోదం పొందాయి. ఈ మేరకు ఈ మూడు అంశాలపై ఇరిగేషన్‌ అధికారులు సదస్సుకు హాజరై ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఈ మూడు సాంకేతిక పత్రాలు రాసిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, ఇరిగేషన్‌ ఈఎన్‌సీ మురళీధర్, అడ్మిన్‌ ఈఎన్‌సీ బి.నాగేందర్‌రావులు అభినందించారు.   

మరిన్ని వార్తలు