కదిలిన ఐపీఎం యంత్రాంగం

14 Dec, 2017 01:52 IST|Sakshi

‘సాక్షి’ఎఫెక్ట్‌.. ‘పాలు కాదు.. పచ్చి విషం’కు స్పందన

పాల నాణ్యతపై తనిఖీలకు రంగంలోకి టాస్క్‌ఫోర్స్‌ బృందాలు

సాక్షి, హైదరాబాద్‌ : పాలల్లో నాణ్యతా లోపాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ‘పాలు కాదు.. పచ్చి విషం’శీర్షికన రెండు రోజుల క్రితం ‘సాక్షి’బ్యానర్‌ కథనానికి వైద్య ఆరోగ్యశాఖ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎం)లు స్పందించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య మంత్రి కె.లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం(ఎఫ్‌ఎస్‌ఎస్‌) సమగ్రంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు.. పాలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రంగంలోకి దిగనున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ కె.శంకర్‌ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు.

ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకు 154 రకాల పాల ప్యాకెట్ల నమూనాలను సేకరించి నాణ్యతను తనిఖీ చేశామని.. ఇందులో 123 నమూనాలను జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సేకరించామన్నారు. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 16, ఇతర ప్రాంతాల్లో 10 బ్రాండ్లకు చెందిన పాల ప్యాకెట్లు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం నిర్దేశించిన ప్రకారం లేవని తెలిపారు. వీరిపై ఆహార భద్రతా ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కేసులు నమోదు చేశామని.. ఇందులో 14 కేసులు విచారణలో ఉన్నాయన్నారు.

మరిన్ని వార్తలు