ఆరు నెలలైనా జీతం రాకపాయే..

29 Oct, 2019 10:37 IST|Sakshi

విద్యాశాఖలో... ఇష్టారాజ్యం

కిచెన్‌ గార్డెన్ల నిర్వహణ పేర వ్యవహారం

విద్యాశాఖ అండతో నిరుద్యోగులకు ఓ ఎన్‌జీఓ టోపీ

పాఠశాలలో కిచెన్‌ గార్డెన్‌లో ఉద్యోగం అంటే సంతోషించిన. హైదరాబాద్‌కు చెందిన ఏజెన్సీ వారు  ఇది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం.. నెలకు రూ.6 వేల జీతం. భవిష్యత్‌లో జీతం పెరుగుతుంది అని అన్నారు. రూ.60 వేలు తీసుకొని కనగల్‌ మోడల్‌ స్కూల్‌లో ఆర్డర్‌ ఇచ్చారు. 5 నెలలకు ఎక్కువగానే పనిచేశా. కానీ జీతం ఇవ్వలేదు. మేము ఇచ్చిన డబ్బులు మాకు ఇవ్వలేదు. క్యాన్సిల్‌ చేశారు. తిరిగి మళ్లీ అనుమతి రాగానే తీసుకుంటామని చెప్పారు. డీఈఓ ఆఫీసుకు పోతే మాకు తెలియదన్నారు. హైదరాబాద్‌లోని ఏజెన్సీ వారిదగ్గరికి వెళ్లినా ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. నాతోపాటు చాలా మంది వద్ద డబ్బులు తీసుకున్నారు. మోసపోయాం. మాకు న్యాయం చేయాలి. – అనూష, కనగల్‌

సాక్షి, నల్లగొండ : జిల్లా విద్యాశాఖలో గుట్టు చప్పుడు కాకుండా తెరవెనుక జరిగిన వ్యవహారంలో ఒక్కోటి బయటపడుతున్నాయి. నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఓ స్వచ్ఛంద సంస్థకు సహకరించేలా విద్యాశాఖ అధికారి జారీ చేసిన ఉత్తర్వులు వెలుగులోకి వచ్చాయి. వివాదాస్పద వ్యవహారాలతో ఇటీవల జిల్లా విద్యాశాఖాధికారి బదిలీ అయ్యారు. ఆ అధికారి పనిచేసిన సమయంలో తీసుకున్న ఓ నిర్ణయం వంద మందికి పైగా నిరుద్యోగులకు నష్టం చేకూర్చి పెట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లో కిచెన్‌ గార్డెన్లు ఏర్పాటు చేసుకుని విద్యార్థులు, అక్కడి సిబ్బంది సహకారంతో వీటిని నిర్వహించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాలను ఆదేశించారు. దీనికోసం ఎలాంటి బడ్జెట్‌ ఉండదని కూడా పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు రసాయన రహితమైన తాజా కూరగాయలను అందించేందుకు కిచెన్‌ గార్డెన్లను ఏర్పాటు చేసుకోవాలన్నది అసలు లక్ష్యం. అయితే, ఉన్నతాధికారులు ఆశించింది ఒకటి కాగా, జిల్లాలో జరిగింది మరొకటి.

చక్రం తిప్పిన మహిళా అధికారి !
జిల్లా విద్యాశాఖలోనే ఇటీవల దాకా జిల్లాస్థాయి ఇన్‌చార్జి పోస్టులో పనిచేసిన ఓ మహిళా అధికారి తనకు సంబంధాలు ఉన్న ‘సుచిత్ర ఎడ్యుకేషన్‌ సొసైటీ’అనే స్వచ్ఛంద సంస్థను రంగంలోకి దింపారు. జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో, కేజీబీవీల్లో కిచెన్‌ గార్డెన్లను ఉచితంగా అభివృద్ధి చేసి ఇస్తామన్న నెపంతో రంగప్రవేశం చేశారు. కిచెన్‌ గార్డెన్ల ఇన్‌చార్జులుగా (కిచెన్‌ గార్డియన్లు) ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు గాలం వేశారు. వీరికి నెలకు రూ.7,500 వేతనం ఇస్తామని కూడా నమ్మబలికారు. కిచెన్‌ గార్డియన్లతో పా టు బ్యూటీషియన్‌ కోర్సులు బోధించడానికి కూడా ఉద్యోగాలు ఇస్తామని ప్ర చారం చేశారు. ఇవన్నీ కూడా ఔట్‌ సో ర్సింగ్‌ విధానంలో చేసుకున్న నియామకాలే. కానీ, ఇలా పోస్టులు ఇవ్వడానికి కిచెన్‌ గార్డియన్ల పోస్టు కోసం రూ.50వేలు, రూ.60వేలు, 80వేలు మొదలు రూ.1.20లక్షలు, బ్యూటీషియన్‌ క్రాఫ్ట్‌ టీచర్‌ కోసం రూ.1.50లక్షలు వసూలు చేశారు. ఇలా మొత్తంగా జిల్లాలో 280 పోస్టులను భర్తీ చేయాలని భావించి సు మారు వంద మంది నుంచి డబ్బులు వ సూలు చేసి పోస్టింగులు కూడా ఇచ్చా రు. ఇలా మొత్తంగా కనీసం రూ.కోటి దాకా వసూలు చేశారని సమాచారం. 

హైదరాబాద్‌కు చెందిన ఈ స్వచ్ఛంద సంస్థ నేరుగా ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకుంది. వారికి ఆయా స్కూళ్ల వారీగా పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చింది. కానీ, పాఠశాలల ప్రధానోపాధ్యాయలు వీరిని విధుల్లో చేర్చుకోలేదు. తమకు ఎలాంటి ఆదేశాలూ లేవని, విధుల్లో ఎలా చేర్చుకంటామని పేచీ పెట్టారు. దీంతో చేసేది లేక ఉద్యోగాలు పొందిన వారంతా తిరిగి ఆ ఎన్‌జీఓ నిర్వాహకులను కలిశారు. ఈ ఎన్‌జీఓకు సహకరిస్తున్న ఓ మహిళా అధికారి రంగంలోకి దిగి జిల్లా విద్యాశాఖాధికారితో జిల్లాలోని అందరు హెచ్‌ఎంలు, మండల విద్యాశాఖాధికారులకు ఉత్తర్వులు ఇప్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన ఈ ఉత్తర్వులు ఇచ్చారు. తమ పోస్టింగ్‌ ఆర్డర్‌కు సపోర్టుగా డీఈఓ ఉత్తర్వులు కూడా ఉండడంతో ఈ రెండు కాపీలను జత చేసి నిరుద్యోగులకు అందజేయడంతో వారు పనుల్లో కుదిరిపోయారు. అయితే, వీరంతా కనీసం ఆరు నెలలు ఎలాంటి జీత భత్యాలు లేకుండా పనిచేశారు. దీంతోపాటు కిచెన్‌ గార్డెన్‌కు అవసరమైన విత్తనాలు సొంతంగా సమకూర్చారు. నేలను దున్నడం వంటిపనులన్నీ చేశారు. అయినా, వేతనాలు అందకపోవడంతో జిల్లా విద్యాశాఖ అధికారులను నిలదీశారు. తమ నుంచి వేలాది రూపాయలు వసూలు చేశారని, వేతనాల మాటటుంచి తాము చెల్లించిన డబ్బులు ఇప్పించాలని గొడవకు దిగారు. ఇది ఎటొచ్చి ఎటు దారితీస్తుందోనని కిచెన్‌ గార్డెన్లు నిలిపివేయాలంటూ డీఈఓ మరో ఉత్తర్వు సెప్టెంబర్‌ 17వ తేదీన ఇచ్చారు. 

నిండా మునిగిన నిరుద్యోగులు
జిల్లా విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను నమ్మి తమకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం వచ్చినట్టేనని సొమ్ములు పోగొట్టుకున్న నిరుద్యోగులు ఇప్పుడు నిండా మునిగినట్లు అయ్యింది. వీరికి నెలనెలా రావాల్సిన వేతనాలు రాకపోవడంతో పాటు ఉద్యోగం కోసం చెలించుకున్న సొమ్ములు కూడా పోయాయి. వారంతా జిల్లా విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరిగిపోతున్నా, తమకు ఎలాంటి సంబంధం లేదని పోస్టింగ్‌ ఇచ్చిన ఎన్జీఓనే నిలదీయాలని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. అయితే, డీఈఓ సపోర్టు ఆర్డర్‌తోనే తాము నమ్మి డబ్బులు చెల్లించుకున్నామని వీరు పేర్కొంటున్నారు. ఇంతా జరిగినా, తమ డబ్బులు రావన్న కారణంతో ఎవరూ ఆ స్వచ్ఛంద సంస్థపైన పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెబుతున్నారు. 

నేను కొత్తగా విధుల్లో చేరా 
నేను రెండు రోజుల క్రితం విధుల్లో చేరాను. ఈ కిచెన్‌ గార్డెన్‌ల గురించి నాకు తెలియదు. ఏం జరిగింది అన్నది తెలుసుకుంటాను. ఉత్తర్వులు, నియామకాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడుతాను. బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలో చూస్తాను.  
– డీఈఓ భిక్షపతి 

మరిన్ని వార్తలు