జీసీసీలో అక్రమాలు నిజమే

4 Aug, 2018 00:27 IST|Sakshi

ప్రాథమిక విచారణలో వెల్లడి

అక్రమాలపై విచారణకు కో ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌ నియామకం

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌(జీసీసీ)లో అక్రమాలు నిజమేనని ప్రాథమిక విచారణలో బహిర్గతమైంది. దీంతో శాఖలో ఆర్థిక అక్రమాలకు కారణమైన జీసీసీ ఉన్నతాధికారిపై వేటుకు గిరిజన సంక్షేమ శాఖ రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అభియోగాల నమోదుతో పాటు ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసేందుకు ఉపక్రమించింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లటంతో నోటీసులు జారీ చేయాలని భావించిన అధికారులు ఆ చర్యను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఆ అధికారి వచ్చిన తర్వాతే షోకాజ్‌ నోటీసు జారీ చేసే అవకాశముందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. జీసీసీలో జరిగిన ఆర్థిక అక్రమాలపై  అధ్యయనం చేసేందుకు కోఆపరేటివ్‌ శాఖకు చెందిన రిజిస్ట్రార్‌ను గిరిజన సంక్షేమ శాఖ నియమించింది. విచారణాధికారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన నిధులను ఓ ప్రైవేటు బ్యాంకులో జమచేయడంతో పాటు ఆర్థిక లావాదేవీల్లో అక్రమాల వ్యవహారం తొలిసారిగా శాఖాపరమైన ఆడిటింగ్‌లో వెలుగు చూసింది.

మరిన్ని వార్తలు