చిట్టితల్లీ క్షేమమేనా?

24 Jun, 2017 02:10 IST|Sakshi
చిట్టితల్లీ క్షేమమేనా?

► ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఫలితమివ్వని ఆధునిక పద్ధతులు
♦ ఆటోమేటిక్‌ రోబో, మాన్యువల్‌ రోబో ద్వారా బయటకు తీసేందుకు యత్నం
♦  ఫలితం లేకపోవడంతో మళ్లీ సమాంతరంగా గొయ్యి తొలుత 40 అడుగుల్లోనే చిక్కుకున్న పాప
♦  మోటార్‌ తీయడంతో 70 అడుగుల లోతులోకి..
♦  సీసీ కెమెరాల్లో కనిపించిన పాప కదలికలు
♦ ప్రాణాలతోనే ఉందని మధ్యాహ్నం నిర్ధారించిన నిపుణులు


చేవెళ్ల/మొయినాబాద్‌/షాబాద్‌:
గంటలు గడచిపోతున్నాయి.. రోజూ మారిపోయింది.. అయినా అదే ఉత్కంఠ.. బోరుబావిలో పడిపోయిన పాపను కాపాడేందుకు చేస్తున్న యత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చిన్నారిని బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం 18 నెలల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. చిన్నారిని బయటకు తీసేందుకు గురువారం రాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం నేతృత్వంలో శుక్రవారం సహాయక చర్యలు చేపట్టారు. ఆటోమేటిక్‌ రెస్క్యూ రోబో, మాన్యువల్‌ రెస్క్యూ రోబోలను ఉపయోగించి చిన్నారిని బయటకు తీసేందుకు యత్నించారు.

నల్లగొండ జిల్లాకు చెందిన బోర్‌వెల్‌ యజమాని కరుణాకర్‌ సైతం తనకు తెలిసిన పరిజ్ఞానంతో పాపను బయటకు తీసేందుకు ప్రయత్నించారు అదీ ఫలించలేదు. ఈ ప్రయత్నాలకు బోరుబావిలో ఉన్న మోటార్‌ అడ్డు వస్తుందని భావించి దాన్ని పైకి లాగారు. అయితే మోటారు మాత్రం పైకి వచ్చి చిన్నారి అందులోనే ఉండిపోయింది. సమాంతరంగా తవ్వే ప్రయత్నంలో నేల కదలికల వల్ల బోరుబావిలో 40 అడుగుల లోతులో ఉన్న చిన్నారి 70 అడుగులకుపైగా లోతులోకి పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అంతకన్నా మరింత లోతులోకి పడిపోయినట్లు తెలుస్తోంది.

శుక్రవారం మధ్యాహ్నం వరకు చిన్నారి కదలికలను గుర్తించినా.. మోటార్‌ను తీసిన తర్వాత నుంచి గుర్తించలేకపోతున్నారు. దీంతో మరో రెస్క్యూ టీంను రప్పించేందుకు అధికార యంత్రాం గం కసరత్తు చేస్తోంది. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావు, సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్యతోపాటు తదితరులు సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ప్రాణాలతో రావాలని..
చిన్నారి ప్రాణాలతో బయటకు రావాలని తల్లిదండ్రులతోపాటు ప్రజలు, అధికారులు, నాయకులు దేవున్ని ప్రార్థిస్తున్నారు. అధునాతన టెక్నాలజీతో రాడ్లను బోరుబావిలోకి వదిలి బయటకు తీసినప్పుడల్లా వేయి కళ్లతో పాప బయటకు వస్తుందని ఆశతో చూస్తున్నారు. ప్రయత్నం విఫలమైనప్పుడల్లా కళ్లు చెమరుస్తూ ఎదురుచూస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కొంతసేపు వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వర్షం తగ్గిన వెంటనే మళ్లీ చర్యలు మొదలు పెట్టారు. తమ పాప ప్రాణాలతో బయటకు వస్తుందని చిన్నారి తల్లిదండ్రులు రేణుక, యాదయ్య ఆశతో ఎదురుచూస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి పాప మరింత లోపలికి వెళ్లినట్లు తెలియడంతో ఆందోళన చెందారు. చిన్నారిని ఎలాగైనా కాపాడుతామంటూ అధికారులు వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

నల్లగొండ నుంచి వచ్చి...
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబాయి గూడెం గ్రామానికి చెందిన మణికంఠ బోర్‌వెల్స్‌ యజమాని పుట్ట కరుణాకర్‌ చిన్నారిని కాపాడేందుకు తనకు తెలిసిన పద్ధతిని ఉపయోగించారు. టీవీల్లో వచ్చిన కథనాలను చూసి ఆయన సంఘటనా స్థలానికి వచ్చారు. 2015 డిసెంబర్‌లో మెదక్‌ జిల్లా పుల్‌కల్‌ మండలం బొమ్మరెడ్డిగూడలో ఇలాగే ఓ బోరుబావిలో బాలుడు పడిపోతే తన పరికరాల సాయంతో ఆయన విజయవంతంగా బయటకు తీయగలిగారు. ఇక్కడ ఇనుప రాడ్ల సాయంతో తాడును, సీసీ కెమెరాలను బోరుబావిలోకి పంపి అందులో పడిపోయిన వారి చిత్రాలను ల్యాప్‌టాప్‌లో గమనిస్తూ కాలు లేదా చేయికి తాడు బిగించి పైకి లాగే పద్ధతిని ఉపయోగించారు. అయితే బోరుబావిలో పడిపోయిన చిన్నారి ఒక చేయి మాత్రమే పైకి ఉండటంతో ఆ చేయికి తాడు బిగించినా అది జారిపోవడంతో బయటకు తీయలేకపోయారు. గురువారం రాత్రి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం వచ్చే వరకు తన ప్రయత్నాన్ని కొనసాగించారు. శుక్రవారం కూడా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ చర్యలు ఫలించకపోవడంతో మరోసారి ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది.

40 అడుగుల నుంచి మరింత లోతుకు..
బోరుబావిలో పడిపోయిన చిన్నారి మొదట్లో 40 అడుగుల లోతులోనే ఇరుక్కుపోయింది. 540 అడుగుల లోతున్న ఈ బోరుబావిలో రైతు రాంరెడ్డి.. 240 అడుగుల వరకు సింగిల్‌ ఫేజ్‌ మోటర్‌ను దించారు. గురువారం చిన్నారి పడిపోయిన తర్వాత మోటార్‌ ను పైకిలాగితే పైకి వస్తుందని భావించి రైతులు పైకి లాగారు. అయితే ఆ మోటార్‌ 40 అడుగుల లోతులో ఉన్న పావ వద్ద ఆగిపోయింది. పైకి రాకపోవడంతో పాపకు ఏమైనా జరుగుతుందన్న భయంతో అక్కడే వదిలేశారు. శుక్రవారం అధికారులు, రెస్క్యూటీంలు వచ్చి 40 అడుగుల లోతులో ఉన్న చిన్నారిని కాపాడే ప్రయత్నంలో మోటార్‌ను పైకి లాగారు. అయితే సమాంతర గోతి కోసం తవ్వుతున్న చర్యలతో కదలికలకు చిన్నారి 70 అడుగుల లోతులోకి వెళ్లింది. దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ప్రాణాలతోనే ఉంది..
బోరుబావిలో ఉన్న చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు డీఆర్‌డీవో ప్రతినిధి, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ నరేంద్రనా«థ్‌ చౌదరి బృందం వచ్చింది. బోరుబావిలోకి ఓ యంత్రాన్ని పంపించి పాప ఆరోగ్య పరిస్థితి, ఉష్ణోగ్రతలను పరిశీలించారు. పాప ప్రాణాలతో ఉందని శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ధ్రువీకరించారు.

కొనసాగుతున్న తవ్వకాలు
పాపను రక్షించేందుకు మొదట్లో అధికారులు బోరుబావికి సమాంతరంగా గొయ్యి తీసే పనులు ప్రారంభించారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆధునిక టెక్నాలజీ పద్ధతులను ఉపయోగించేందుకు ఈ పనులను నిలిపివేశారు. కానీ అవేవీ ఫలించకపోవడంతో మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. నాలుగు ఇటాచీలు, రెండు జేసీబీలతో పనుల్ని వేగవంతం చేశారు.

రోబోలు రక్షించలేవా..!
తరుచుగా చిన్నారులు బోరుబావుల్లో పడుతున్న సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు మార్గాలు కనుక్కోవటంలో శాస్త్రపరిజ్ఞానం ఇంకా వెనుకంజలోనే ఉంది. గడిచిన పదేళ్లలో బోరుబావుల్లో పడిన చిన్నారులు సురక్షితంగా బయటపడ్డ ఘటనలు వేళ్లపై లెక్కించవచ్చు. 2006లో హరియాణాలోని కురుక్షేత్రకు సమీపంలో ప్రిన్స్‌ అనే ఐదేళ్ల బాలుడితో పాటు.. 2015 అక్టోబర్‌లో రాజస్థాన్‌లోని దౌసాలో జ్యోతి అనే చిన్నారి మృత్యుంజయులుగా బయటపడ్డారు. కురుక్షేత్ర సమీపంలోని ఘటనలో ఏకంగా సైన్యం రంగంలోకి దిగింది. సమీపంలో ఎండిన వ్యవసాయ బావి ఉండటంతో.. బావి అట్టడుగు నుంచి బోరుబావిలో చిన్నారిని గుర్తించిన ప్రాంతానికి సొరంగ మార్గం తవ్వి సురక్షితంగా బయటకు తీశారు. పలు పరిశోధనల్లో బోరుబావుల్లో పడిన చిన్నారులను రక్షించేందుకు ఆటోమోటిక్‌ రెస్క్యూ రోబోలను తయారు చేశారు. ప్రయోగాత్మకంగా ఇవి విజయం సాధించినట్లు కనబడినా.. నిజంగా ఆపద సంభవించినప్పుడు విఫలమయ్యాయి.

ఘటన జరిగిన ప్రాంతంలోని భూగర్భ పరిస్థితులు అనుకూలించకపోతే రెస్క్యూ చేయటం కష్టమని నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో రోబో సాయంతో చిన్నారులను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తే బోరు ఎంత లోతు.. ఎంత వెడల్పు ఉందనే సాంకేతిక అంశాలు కీలకమవుతున్నాయని అంగీకరిస్తున్నారు. మట్టి తడిగా ఉన్నప్పుడు రోబోలు వాడితే మట్టి మరింత కూలిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

రెండు పద్ధతుల ద్వారా..
బోరుబావిలో పడిపోయిన వారిని కాపాడేందుకు చాలాకాలం నుంచి ఉపయోగిస్తూ వస్తున్న పద్ధతి ఆ బావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వడం. కానీ చిన్నారిని కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం రెండు కొత్త టెక్నాలజీలను ఉపయోగించి పాపను రక్షించే ప్రయత్నం చేసింది.

ఆటోమేటిక్‌ రెస్క్యూ రోబో..
ఆటోమెటిక్‌ రెస్క్యూ రోబో పరికరాన్ని మిషన్‌తో నియంత్రిస్తూ బోరుబావిలోకి వదిలారు. ఈ పరికరం బోరుబావిలో పడిపోయిన వారిని బిగించుకుని పైకి లాగుతుంది. ఈ పద్ధతిలో పాపను బయటకు లాగేందుకు పలుమార్లు ప్రయత్నం చేసినా సఫలం కాలేదు.

మాన్యువల్‌ రెస్క్యూ రోబో
ఈ పద్ధతిలో రెండు చేతుల మాదిరిగా ఉన్న రోబో పరికరాలను బోరుబావులోకి పంపి బయటకు తీసే యత్నం చేశారు. ఇది కూడా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. బోరుబావిలో పడిపోయిన చిన్నారి ఒక చేయి మాత్రమే పైకి ఉండటంతో ఈ పరికరం పాపను పట్టుకోలేకపోయింది. పలు మార్లు ప్రయత్నించినా జారిపోవడంతో ఈ ప్రయత్నాన్ని విరమించారు. ఈ రెండు పద్ధతులను మహారాష్ట్రలోని బీజాపూర్‌లో ఇలాంటి రెండు మూడు సంఘటనల్లో ఉపయోగించి మంచి ఫలితాలను సాధించినట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కమాండర్‌ డీఎన్‌ సింగ్‌ తెలిపారు.
70–80 అడుగుల లోతుల్లో ఉంది
పాపను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాం. రోబోటిక్‌ టెక్నాలజీ, సంప్రదాయ పద్ధతులతో వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నాం. పాప తొలుత 40 అడుగుల లోతుల్లో చిక్కుకున్నట్లు గుర్తించాం. ఏకకాలంలో మోటారు పంపు, చిన్నారిని పైకి లాగే క్రమంలో మోటారు వచ్చినా.. పాప మరింత లోతుల్లోకి పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 70 నుంచి 80 అడుగుల లోతుల్లో పాప ఉన్నట్లు అంచనా వేశాం. శుక్రవారం మధ్యాహ్నాం తర్వాత నుంచి చిన్నారి కదలికలు కనిపించడం లేదు. ప్రస్తుతం 40 ఫీట్ల మేర సమాంతరంగా గొయ్యి తవ్వాం. రాతి నేల కావడం, వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. – జిల్లా కలెక్టర్‌ ఎం.రఘునందన్‌రావు

మరిన్ని వార్తలు