కీలక రంగాల్లో పెట్టుబడులే లక్ష్యం

28 Sep, 2019 02:41 IST|Sakshi
హైదరాబాద్‌ నాలెడ్జ్జ్‌సిటీలోని స్కైవ్యూ భవనంలో ఎంఫసిస్‌ ఫెసిలిటీ సెంటర్‌ను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న మంత్రి కేటీరామారావు. చిత్రంలో సంస్థ సీఈఓ నితిన్‌రాకేష్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌  

స్థానిక విద్యార్థుల్లో నైపుణ్యం మరింత పెంచేలా శిక్షణ  

ఎంఫసిస్‌ విస్తరణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఐటీ సంస్థ ఎంఫపిస్‌ నూతన కార్యాలయాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు. స్థానిక నైపుణ్యాన్ని వినియోగించుకుని ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు ఆకర్షించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఐటీ ఎగుమతుల్లో ఐదేళ్లుగా బెంగుళూరును అధిగమించడంతో పాటు దేశ సగటు కంటే హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉందని కేటీఆర్‌ వెల్లడించారు. ఐటీ ఉత్పత్తుల్లో నాణ్యత ఉండాలని వినియోగదారులు కోరుకుంటున్న నేపథ్యంలో.. ఆయా సంస్థలు ఆ దిశగా దృష్టి కేంద్రీకరించాలని, నాణ్యత పెంచేందుకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామన్నారు. ‘టాస్‌్క’ద్వారా స్థానిక ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఐటీ సంస్థల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. లోకల్‌ ట్యాలెంట్‌ను ప్రోత్సహించేందుకు అందరూ ముందుకురావాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులకు కొదవలేదన్నారు. ఐటీ రంగంలోనే అనేక నూతన సాంకేతిక ఆవిష్కరణలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో స్థానికంగా జరిగే నూతన సాంకేతిక ఆవిష్కరణల్లో ప్రభుత్వం కూడా భాగస్వామ్యం వహించాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. విదేశాల్లో స్థిరపడిన దేశీయ నిపుణులు తిరిగి స్వదేశానికి చేరుకునే వాతావరణాన్ని కలి్పంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 

ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు
మూడేళ్ల క్రితం రాష్ట్రంలో అడుగిడిన ఎంఫసిస్‌ ఐటీ సంస్థ మూడేళ్లలో మూడింతల వృద్ధి సాధించడం హర్షణీయమని, వేయి మందికి ఉద్యోగావకాశాలు కలి్పంచిన సంస్థ ఎక్కువ మందికి ఉపాధి కలి్పంచేలా ఎదగాలని మంత్రి  కేటీఆర్‌ ఆకాంక్షిం చారు. ఈ కార్యక్రమంలో ఎంఫసిస్‌ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, డైరెక్టర్‌ నితిన్‌రాకేశ్, ఐటీ, పరిశ్రమల కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు. అనంతరం మాదాపూర్‌ వెస్ట్రన్‌ హోటల్‌లో థండర్‌ సాఫ్ట్‌ ఐటీ కంపెనీ వార్షికోత్సవంలోనూ కేటీఆర్‌ పాల్గొన్నారు. మరో 850 మందికి ఉద్యోగాలు ఇస్తామని థండర్‌ సాఫ్ట్‌ కంపెనీ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. చైనా ఐటీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తునట్లు చెప్పారు. 

నగరపాలికల్లో విపత్తు నిర్వహణ విభాగాలు 
రాష్ట్రంలోని అన్ని నగర పాలక సంస్థలకు విపత్తు నిర్వహణ, నిఘా బృందాల (డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌–విజిలెన్స్‌ ఫోర్స్‌)ను ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌ బుద్ధ భవన్‌లోని జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఫోర్స్‌ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉల్లంఘనల నిర్వహణను ఆన్‌లైన్‌ చేసేందుకు ఉద్దేశించిన నగర సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ను ప్రారంభించి, మొబైల్‌ యాప్‌ను కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..

అక్రమంగా భవన నిర్మాణ వ్యర్ధాల పారవేత, చెత్త వేయడం, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ మొదలైన ఉల్లంఘనలు, జరిమానాలను ఈ యాప్‌ ద్వారా పారదర్శకంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. నగరాల్లో జరిగే ప్రమాదాలు, ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా పక్కా ప్రణాళికతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు విపత్తు నిర్వహణ విభాగాలను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్‌ సిటీలో భాగంగా తొలిదశలో వరంగల్, కరీంనగర్‌ కార్పొరేషన్లలో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. 

మరిన్ని వార్తలు