కాంగ్రెస్‌ ఎప్పుడూ హీరోనే : జగ్గారెడ్డి

26 Jan, 2020 13:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంగారెడ్డిలో మేము ఓడిపోవడం మంచిదే.. గెలిస్తే మేము మున్సిపల్‌ చైర్మన్‌గా ఏ పనీ చేయలేకపోయేవాళ్లమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ గట్టి పోటీనిచ్చిందని పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అభివృద్ధి అనే చర్చే రాలేదని.. కేవలం డబ్బు ప్రభావమే ఉందన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ చిత్తశుద్ధితో అధికార పార్టీపై పోరాడారని తెలిపారు. కాంగ్రెస్‌ గెలిచినా, ఓడినా ఎప్పుడూ హీరోనే అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన రాష్ట్ర కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర నాయకత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేసిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ డబ్బు ప్రభావంతో గెలిచింది
మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు పెద్ద గొప్ప కాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ‘అధికారంలో ఉన్న పార్టీకి అంగబలం, అర్థబలం అన్నీ ఉంటాయి. కాబట్టి కాబట్టి వాళ్లకు గెలుపు అవకాశాలు ఎక్కువ. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ డబ్బు ప్రభావంతో గెలిచింది. మా దగ్గర డబ్బు లేదు, కాబట్టి వెనుకబడ్డాం. అంతమాత్రాన కాంగ్రెస్‌కు ప్రజాదరణ లేదనుకుంటే పొరపాటే. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థులు 5, 10 ఓట్ల తేడాతో ఓడిపోయారు’.

శభాష్‌ హరీష్‌ రావు
సంగారెడ్డి కాంగ్రెస్‌కు కంచుకోట. అలాంటి చోట టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేసిన మంత్రి హరీష్‌ రావును అభినందిస్తున్నాను. కేసీఆర్‌ చెప్పినట్టుగా 100 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేసింది. దానికి కృషి చేసిన కేటీఆర్‌ను కూడా అభినందిస్తున్నా. కానీ ఎన్నికల్లో ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలనే విషయం కేసీఆర్‌ను చూసి నేర్చుకుంటున్నా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలు కేసీఆర్‌ వైపే ఎందుకు నిలబడుతున్నారనేది కాంగ్రెస్‌ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంద’ని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

చదవండి: ఫలించిన హరీష్‌ రావు వ్యూహాలు.. జగ్గారెడ్డికి ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు