‘కేసీఆర్, హరీష్‌లకు చుక్కలు చూపిస్తా’

17 Oct, 2018 15:44 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతకాని నాయకులని సంగారెడ్డిలో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. తనకు చుక్కలు చూపించిన కేసీఆర్, హరీష్ రావుకు చుక్కలు చూపిస్తానని మండిపడ్డారు. పోలీసుల రక్షణ లేకుండా తాను సిద్దిపేటకు వస్తానని, దమ్ముంటే హరీష్ రావు పోలీసులు లేకుండా సంగారెడ్డికి రావాలని సవాలు విసిరారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు.

కేసీఆర్ మరో శిశుపాలుడని ధ్వజమెత్తారు. గెలిచిన 6నెలల్లో నియోజకవర్గంలో 40వేల ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. తనను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిచుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలు, సంగారెడ్డి ప్రజలపైనే ఉందన్నారు. తెలంగాణ డబ్బులను కేటీఆర్ విదేశాల్లో దాచిపెట్టుకుంటున్నాడని ఆరోపించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కేసీఆర్ వంగి, వంగి సలాములు పెట్టిన రోజులు మర్చిపోయావా? అని ఎద్దేవా చేశారు. టీడీపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటే తప్పులేదు కానీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తప్పా అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు