కేఎఫ్‌ బీర్లను విక్రయించాలి.. వైరల్‌ లేఖ

26 Sep, 2018 08:24 IST|Sakshi

సాక్షి, జగిత్యాల‌ : ప్రజావాణిలో జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు ఓ వ్యక్తి రాసిచ్చిన ఫిర్యాదు లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. వైన్స్‌షాపుల్లో, బార్లలో కింగ్‌ ఫిషర్‌ బీర్లను విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జగిత్యాలకు చెందిన అయిల సూర్యనారాయణ(టీవీ.సూర్యం) సోమవారం జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మద్యంప్రియులు, యువత ఎక్కువగా ఇష్టపడే కింగ్‌ఫిషర్‌ బీర్ల విక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందన్నారు. మద్యం విక్రయదారులు సిండికేట్‌గా మారి కింగ్‌ఫిషర్‌ బీర్లను విక్రయించడం మానేశారని, వాటి స్థానంలో నాసిరకం బీర్లను విక్రయిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 లో పేర్కొన్న ప్రాథమిక హక్కులలోని స్వేచ్ఛతో కూడిన కొనుగోలు హక్కుకు మద్యం విక్రయదారులు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీర్ల విక్రయాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో బీర్లపై ఫిర్యాదు రావడంతో అధికారులతో పాటూ, ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారు కూడా ఆశ్చర్యపోయారు. అధికారులు ఆ లేఖను అబ్కారీ శాఖకు పంపారు. 

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న లేఖ

మరిన్ని వార్తలు