ఆ బిల్లులో అన్నీ చిల్లులే..

20 Apr, 2017 00:43 IST|Sakshi
ఆ బిల్లులో అన్నీ చిల్లులే..

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ముస్లిం రిజర్వేషన్‌ బిల్లులో అన్నీ చిల్లులే ఉన్నాయి. ఇది చిత్ర విచిత్రమైన బిల్లు అని కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. ఈ బిల్లు గర్భంలోనే చనిపోయిన శిశువుకు ప్రసవం లాంటిదని వ్యాఖ్యానించారు. లోపభూయిష్టమైన, మోసపూరితమైన ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతున్నారని తెలిపారు. రాష్ట్రపతి దీనిని కేంద్రం వద్దకు పంపుతారని చివరికి ప్రదానమంత్రి మోదీ చేతిలో ఈ బిల్లు ఏమవుతుందో అందరికీ తెలుసునని అన్నారు. రాష్ట్రపతికి పంపకుండా ఇక్కడే నోటిఫై చేసే వీలున్నా అది కోర్టులో నిలవదని చెప్పారు.

అయితే మోదీ చేతిలో లేదా కోర్టు పరిధిలో బిల్లు సమాధి కావాల్సిందేనని అన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లను తమ పార్టీ స్వాగతిసో‍్తందని చెప్పారు. రెండు రకాల రిజర్వేషన్లు కలపడం వల్ల దానికి రాజ్యాంగ ఆమోదం లేకుండా చేసే పరిస్థితి కల్పించారని ఆరోపించారు. దీనికారణంగా హిందు-ముస్లిం ద్వేషభావం కల్పించే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ముస్లింలకు ఇప్పటికే ఉన్న నాలుగు శాతం పోయే ప్రమాదం ఉందని చెప్పారు. మోసం చేస్తోన్న టీఆర్ఎస్ విధానాన్ని జైపాల్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

వాల్మీకి, వడ్డెరలను ఎస్టీలలో కలపాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ జాతుల్లో ఒక్క కులాన్ని కలపాలన్నా పార్లమెంట్ ఆమోదం కావాలని వివరించారు. తమిళనాడు రిజర్వేషన్లు శాశ్వతం కాదని చెప్పారు. కేసీఆర్ రాజ్యాంగ నిపుణుడు... తాను కాదని విమర్శించారు. రాజ్యాంగం దేశానికి ఉంటుంది కానీ. రాష్ట్రాలకు కాదని అన్నారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లకు తాము సానుకూలమేనంటూ ఆయన.. సర్కారు చేస్తోన్న మోసాన్ని మాత్రమే చెబుతున్నానన్నారు. రిజర్వేషన్లకు 50 శాతం పరిధి ఉండాలని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు