సాక్షి, జగిత్యాల : కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం చేతులెత్తేసిందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ర్ట ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు. ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఘాటుగా స్పందించిన తీరు చూస్తుంటే హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి ఉందని జీవన్రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కరోనా టెస్టింగ్ కెపాసిటీ పెంచాలని, ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందిగా ముఖ్యమంత్రికి గవర్నర్ తమిళిసై సూచించారని పేర్కొన్నారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, పూర్తిగా నైతికతను కోల్పోయిందని ఘాటుగా విమర్శించారు. (సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ )
'ఒకప్పుడు ఢిల్లీ మర్కజ్, ముంబై వలసకూలీల వల్ల కరోనా కేసులు పెరిగితే ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రేటర్ హైదరాబాద్ కంటే మిగిలిన జిల్లాలోనూ కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి. అంతేకాకుండా పరీక్షల కోసం గంటల కొద్ది జనాలు క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. వాళ్లంతట వాళ్ల పరీక్షలు చేయించుకుంటాం అని ముందుకొస్తే కూడా టెస్టులు చేయడం లేదంటే రాష్ర్టంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అటు గవర్నర్, ఇటు హైకోర్టు మందలించినా ప్రభుత్వంలో చలనం లేదు. భవిష్యత్తులో తెలంగాణలో కరోనా తీవ్రత అమెరికా, ఇటలీని మించిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార సంస్థలు సైతం స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకునే పరిస్థితి వచ్చినా ప్రభుత్వానికి మాత్రం ఆదాయ ఆలోచన తప్పా వేరే ధ్యాస లేదంటూ' జీవన్రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణలో ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులను ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కరోనా కట్టడికి రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వనకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని జీవన్రెడ్డి కోరారు. (నేనూ కరీంనగర్లోనే చదువుకున్నా: కేటీఆర్ )