మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు 

7 Dec, 2019 05:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులతో ఈ నెల 1వ తేదీన సీఎం కేసీఆర్‌ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం దిశగా టీఎస్‌ఆర్టీసీ అధికారులు ప్రాధాన్యతాక్రమంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఆదేశాల మేరకు సమ్మె కాలంలో మరణించిన 33 మంది ఉద్యోగుల పిల్లలకు విద్యార్హతలను బట్టి ఆర్టీసీలో ఉద్యోగాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరణించిన 38 మంది ఉద్యోగులకు సంబంధించి 22 కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆయా జిల్లాల కలెక్టర్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించగా, మరో 16 కుటుంబాలకు శనివారం పరిహారం అందజేయనున్నారు. రాత్రి 8 గంటల్లోగా మహిళా ఉద్యోగుల డ్యూటీ ముగిసేలా త్వరితగతిన షెడ్యూలు సర్దుబాటు చేయాలని సునీల్‌శర్మ డిపో మేనేజర్లను ఆదేశించారు. మహిళా ఉద్యోగుల కోసం ఈ నెల 15 లోగా హైదరాబాద్‌ నగరంలో విశ్రాంతి గదులతో పాటు, డిపోలు, హైదరాబాద్‌ సిటీ చేంజ్‌ఓవర్‌ పాయింట్ల వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చీఫ్‌ సివిల్‌ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లను ఆదేశించారు.

మరిన్ని వార్తలు