అధికారులు సమన్వయంతో పని చేయాలి

18 Jul, 2018 11:10 IST|Sakshi
ఆరోగ్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి

జైనథ్‌: గ్రామ స్థాయిలో పని చేసే అధికారులంతా సమన్వయంతో పని చేస్తూ, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై శాఖలవారీగా సమీక్షా నిర్వహించారు. విద్యుత్, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి సర్వసభ్య సమావేశంలో సర్పంచులు చెప్పిన గ్రామాల్లోని విద్యుత్‌ సమస్యలు ఇంకా తీరకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. ఇందిర జలప్రభ కింద కనెక్షన్ల మంజూరు, గ్రామాల్లో లూస్‌లైన్స్, విద్యుత్‌ స్తంభాలు, డీటీఆర్‌లు ఏర్పాటు చేయడం, ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ కంచె ఏర్పాటు చేయడం వంటి కనీసమైన చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఆరోగ్యశాఖ సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాల్లోనే నివాసముండాలని ఆదేశించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమ్మఒడి, కేసీఆర్‌ కిట్ల పంపిణీలో ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, గ్రా మాల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణం, చెత్త రిక్షాల వాడకం పెంచాలన్నారు. ప్రతిఒక్కరూ హరితహారంలో స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు పెంచే లా ప్రజలను ప్రోత్సహించాలన్నారు.

ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా క్షేత్రస్థాయిలో పని చేసే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తే లబ్ధిదారులకు అందకుండా పోతాయన్నా రు. ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌లో భాగంగా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి కూలీ బిల్లులు ఒక్కో పంచాయతీకి రూ. 50–55 వేలు పెండింగ్‌ ఉన్నట్లు సర్పంచులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ బిల్లులను వెంటనే విడుదల చేయాలని పీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఎంపీపీ తల్లెల శోభ, జెడ్పీటీసీ పెందూర్‌ ఆశారాణి, తహసీల్దార్‌ బొల్లెం ప్రభాకర్, ఎంపీడీవో రామకృష్ణ, ఈవోపీఆర్డీ సం జీవ్‌రావ్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు