జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

20 May, 2018 12:34 IST|Sakshi
వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న యూనియన్‌ నాయకులు

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి) : వర్కింగ్‌ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఫైజల్,జిల్లా ఆధ్యక్షకార్యదర్శులు మల్లికార్జున్‌ రెడ్డి,విష్ణు ప్రసాద్‌ లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.శనివారం పట్టణంలోని ఐబీలో స్థానిక జర్నలిస్టులతో కలిసి జర్నలిస్టుల గర్జన గోడ పత్రిక,కర పత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ రంగాలలో పని చేస్తున్న జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు.

ఉద్యమ వార్తలను, ఉద్యమకారుల ఆందోళన, నిరసనను ప్రభుత్వానికి చాటి చెప్పడానికి విలేకరులు ఎంతోగానో శ్రమించారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్న ఇప్పటి వరకు జర్నలిస్టుల న్యాయ పరమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. ఇళ్ల స్థలాలు, మెరుగైన వైద్యసేవలను అందించాలని అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నెల 28వ తేదీన ఉదయం 11గంటలకు హైదరాబాద్‌ లోని బాగ్‌ లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో జర్నలిస్టుల గర్జన బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన విలేకరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. కార్యక్రమంలో ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు ఉల్లిగడ్డల శివకుమార్, హాజీ, నరేశ్, విజయ్, నెల్లి శ్రీనివాస్, సిద్ధు, బుచ్చయ్య, నర్సిములు, లింగం, శేఖర్, శివకుమార్‌ గౌడ్, నగేశ్, చిరు, మహేశ్, విశ్వనాథం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు