సిరిసిల్లటౌన్: పోటీ ప్రపంచంలో అందరూ కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల వైపు తల్లిదండ్రులు పరుగులు తీస్తుండగా.. ఓ న్యాయమూర్తి తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 9వ అదనపు సెషన్స్ జడ్జి అంగడి జయరాజ్ తన ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నిశ్చయించుకున్నారు. పది రోజులుగా జిల్లా కేంద్రంలోని బాలికల సెకండరీ పాఠశాలలో అందుతున్న విద్యపై తెలుసుకున్నారు. గురువారం ఇద్దరు కూతుళ్లు జనహిత (10వ తరగతి), సంఘహిత (8వ తరగతి)లను స్వయంగా వచ్చి చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే సుశిక్షుతులైన ఉపాధ్యాయులు ఉంటారనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. న్యాయమూర్తి తమ పాఠశాలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పాఠశాల హెచ్ఎం సుధారాణి తెలిపారు.