‘వయస్సు’మీరింది!

18 Oct, 2019 01:18 IST|Sakshi

గతంలో నిరుద్యోగులకు 10 ఏళ్ల సడలింపు

గత జూలైలో ముగిసిన వయోపరిమితి పెంపు అమలు గడువు

సర్కారీ కొలువులకు అర్హత కోల్పోయామని నిరుద్యోగుల ఆవేదన

సాక్షి, హైదరాబాద్‌:నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి 10 ఏళ్లు పొడిగిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల అమలు గడువు ముగియడంతో లక్షలాది నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే అవకాశాన్ని కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యంతో 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితి దాటి అనర్హులుగా మారిన నిరుద్యోగులకు మరో అవకాశం కల్పించేందుకు గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు పొడిగిస్తూ 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 44 ఏళ్లకు వయోపరిమితి పెరగడంతో వేలాది మందికి ప్రయోజనం కలిగింది.

తొలుత ఏడాది అమలు గడువుతో ఈ ఉత్తర్వులను జారీ చేయగా, నాలుగేళ్లుగా గడువును పొడిగిస్తూ వస్తున్నారు. చివరిసారి జారీ చేసిన జీవో అమలు గడువు గత జూలై 27తో ముగిసింది. మళ్లీ జీవో అమలు గడువును పొడిగిస్తూ కొత్త జీవో జారీ చేసే అంశాన్ని ప్రభుత్వం మర్చిపోయింది.దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ 3,025 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేయడంతోపాటు టీఎస్‌పీఎస్సీ నుంచి నియామక ప్రకటనలు వస్తున్నాయి.వీటితో పాటు భవిష్యత్తులో చేపట్టే ఉద్యోగ నియామకాలకు పోటీపడే అవకాశాన్ని కోల్పోయామని నిరుద్యోగులు మదనపడుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సుల మేరకు గతంలో గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు ప్రభుత్వం పెంచిందని, ఈ ఉత్తర్వుల అమలు గడువును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు