టీఎస్‌ హైకోర్టు సీజేగా జస్టిస్‌ చౌహాన్‌ నియామకం

19 Jun, 2019 19:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగిన జస్టిస్‌ చౌహాన్‌ను ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించాలని న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నెల రోజుల క్రితమే జస్టిస్‌ చౌహాన్‌ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి అనుమతితో కేంద్రం ఈ నియామక నోటిఫికేషన్‌ జారీ చేసింది.

జస్టిస్‌ చౌహాన్‌ నేపథ్యం... జస్టిస్‌ చౌహాన్‌ 1959 డిసెంబర్‌ 24న జన్మించారు. 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 2005లో రాజస్తాన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.

హిమాచల్‌ హైకోర్టు సీజేగా రామసుబ్రమణియన్‌..
సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు మేరకు తెలంగాణ హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న జస్టిస్‌ వి రామసుబ్రమణియన్‌కు కేంద్రం పదోన్నతి కల్పించింది. ఆయనను హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మరిన్ని వార్తలు