హైకోర్టు సీజేగా జస్టిస్‌ చౌహాన్‌..

14 May, 2019 01:25 IST|Sakshi

హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు సీజేగా రామసుబ్రమణియన్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా చౌహాన్‌ వ్యవహరిస్తున్నారు. హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌కు పదోన్నతి ఇవ్వాలని కూడా కొలీజియం నిర్ణయించింది. ఆయనను హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ ఎన్‌వీ రమణలతో కూడిన కొలీజియం ఇటీవల సమావేశమై ఈ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులను కేంద్రం ఆమోద ముద్ర వేశాక సంబంధిత ఫైలు రాష్ట్రపతికి చేరుతుంది.

రాష్ట్రపతి ఆమోదం తర్వాత వీరి నియామక నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. జస్టిస్‌ చౌహాన్‌ నేపథ్యం... జస్టిస్‌ చౌహాన్‌ 1959 డిసెంబర్‌ 24న జన్మించారు. 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 2005లో రాజస్తాన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ఇటీవల కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు.

దీనితో సీనియర్‌ అయిన జస్టిస్‌ చౌహాన్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గా నియమితులై అదే పోస్టులో కొనసాగుతున్నారు. జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేపథ్యం జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ 1958 జూన్‌ 30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సీనియర్‌ న్యాయవాదులు కె.సార్వభౌమన్, టి.ఆర్‌.మణిల వద్ద న్యాయ మెళకులు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్‌ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

మరిన్ని వార్తలు