రాష్ట్రాభివృద్ధికి కేంద్రం దోహదపడుతోంది

8 Apr, 2017 02:50 IST|Sakshi
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం దోహదపడుతోంది

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మొదటి విడతగా మహబూబ్‌నగర్, వరంగల్‌లో పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల ఏర్పాటుకు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ సుముఖత వ్యక్తం చేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున తాను కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి కేంద్రం దోహదపడుతోందని చెప్పడానికి ఇది ఉదాహరణ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి సరైన సమయంలో తగిన ప్రతిపాదనలు పంపిస్తే, వాటిపై నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాభివృద్ధికి కేంద్రం దోహదపడుతుందని అన్నారు. రెండు జిల్లాల్లో పాస్‌పోర్టు కేంద్రాల ఏర్పాటుకు కృషి చేసిన మోదీ ప్రభుత్వానికి, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, బండారు దత్తాత్రేయలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు