గట్టుభూత్కూర్ చెరువులోకి కాళేశ్వరం నీరు
సాగులోకి బీడు భూములు ఆనందంలో రైతన్నలు
సాక్షి, గంగాధర(కరీంనగర్) : కొన్నేళ్లుగా నీరు లేని చెరువు కాలం కరుణించకున్నా జలకళ సంతరించుకుంటుంది. సాగునీరు కరువై బీడు వారిన వ్యవసాయభూములు సాగుకు నోచుకోనున్నాయి. దీంతో సాగునీటి సమస్యతో సతమతమైన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గట్టుభూత్కూర్ ఊర చెరువులోకి కాలం కరుణించక చాలా సంత్సరాల దాకా నీరు రాలేదు. చెరువుకింది వ్యవసాయ భూములు సాగుకు నోచుకోలేదు. భూగర్భ జలాలు అడుగంటి పోయి వ్యవసాయ బావుల కింద సైతం నామమాత్రంగా పంటలు సాగయ్యేవి.
కాళేశ్వరం నీరు
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో సైతం కాలం కరుణించక పోయినప్పటికీ ఊరచెరువుకు కాళేశ్వరం ప్రాజక్టు నీరు చేరుతుండటంతో చెరువు నిండుకుండలా మారనుంది. మండలంలోని తాడిజర్రి గ్రామ శివారు నుంచి వెళ్తున్న వరదకాలువ ద్వారా గట్టుభూత్కూర్ ఊరచెరువుకు నీరు తరలించడానికి దాదాపు రూ.30 లక్షల రూపాయల వ్యయంతో తూం ఏర్పాటు చేశారు. గత పది రోజుల నుంచి రామడుగు మండలంలోని లక్ష్మిపూర్లోని గాయత్రి పంప్హౌజ్ నుంచి మూడు బాహుబలి మోటర్ల ద్వార వరదకాలువ నుంచి రాజరాజేశ్వర ప్రాజెక్టుకు (మిడ్మానేర్) నీరు సరఫరా చేస్తున్నారు. వరదకాలువ నిండుగా నీరు వెలుతుండటంతో తూం నుంచి చెరువుకు నీరు చేరుతుంది. చెరువు నిండితే మత్తడి ద్వారా దిగువలోని వెలిచాల చెరువుకు సైతం నీరు చేరే అవకాశం ఉంది.
మిషన్కాకతీయలో చెరువుకు మరమ్మతు
107 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊరచెరువును మిషన్కాకతీయ పథకంలో మొదటి విడతలోనే 2014–15 ఆర్థిక సంవత్సరంలో మరమ్మత్తులు చేశారు. దాదాపు కోటి రూపాయల వ్యయంతో చెరువులో పూడికతీత పనులు, కట్ట, మత్తడి, తూం మరమ్మత్తు చేశారు. వరదకాలువ నుండి వస్తున్న నీటితో ఇప్పటి వరకు దాదాపు 70 శాతం చెరువులోకి నీరు చేరింది. మరో నాలుగైదు రోజులు చెరువులోకి నీరువస్తే మత్తడి దూకి వెలిచాల చెరువులోకి నీళ్లు వెళ్తాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
పంటలసాగు
ఊరచెరువులోకి వరదకాలువ నుండి నీరు సరఫరా చేస్తుండటంతో దిగువ ప్రాంత రైతులతో పాటు, తూంల మీద ఆధారపడి పంటలు సాగు చేసే రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు. చెరువు నిండితే తూం ద్వారా దా దాపు ఐదు వందల ఎకరాల్లో పంటలు సా గయ్యే అవకాశాలున్నాయి. అలాగే భూగర్భ జలాలు పెరిగి మరోవేయి ఎకరాలకు సాగునీ రందుతుందని రైతులు పేర్కొంటున్నారు. చె రువు నిండితే సాగునీటితో పాటు, భూగర్భ జ లాలు పెరిగి తాగునీటి సమస్య సైతం పరి ష్కారం అవుతుందని గ్రామస్తులు అభిప్రాయ పడుతున్నారు.