కరోనా రహితంగా కామారెడ్డి: వేముల ప్రశాంత్‌రెడ్డి

22 May, 2020 20:57 IST|Sakshi

సాక్షి కామారెడ్డి : జిల్లా కరోనా వైరస్‌ రహిత జిల్లాగా మారిందని  రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర నుండి 474 మంది వచ్చారని, వారందరినీ 28 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ చేశామని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి క్లస్టర్‌లో 20 లక్షలతో రైతు వేదికల నిర్మాణాలకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.  తెలంగాణ రైతులు లాభసాటి వ్యవసాయం, గిట్టుబాటు ధరలు పొందేందుకు ముఖ్యమంత్రి ప్రణాళిక రూపొందించారు. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే గిట్టుబాటు వస్తుంది. రైతు నష్ట పోవద్దనే ఉద్దేశ్యంతో కేసీఆర్ నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. వర్షాకాలంలో మక్కపంట వేయద్దు, యాసంగిలొనే మక్కపంట వేయాలి. 

కందులు పండిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుకు సిద్దంగా ఉంది. రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. లాభసాటి వ్యవసాయం కోసం ప్రభుత్వం సూచించిన పంటలు వేయాలని కోరుతున్నాం. మక్క పంట 85వేల ఎకరాల బదులు వాటి స్థానంలో సొయా 25వేలు, కందులు 30వేలు, పత్తి 70వేల ఎకరాలకు పెంచుకోవాలి. రైతులు, నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్షలు జరిపి తెలంగాణ లాభసాటి వ్యవసాయ విధానం రూపొందించారు’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు