దృష్టి మారుతోంది..

28 Aug, 2018 11:09 IST|Sakshi
కంటి పరీక్షలు చేస్తున్న వైద్యుడు

ఆదిలాబాద్‌టౌన్‌: కంటివెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కంటి చూపు సమస్యల పరిష్కరించుకోవడానికి జనం ముందుకు వస్తున్నారు. ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు పంపిణీ చేస్తుండడంతో అన్ని వర్గాల వారు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏడు రోజుల్లో 20వేల మందికి వైద్యులు కంటి పరీక్షలు చేశారు. పట్టణ ప్రాంతాల్లో రోజుకు 350 మందికి, గ్రామీణ ప్రాంతంలో రోజుకు 300 మందికి కంటి పరీక్షలు చేయాలని వైద్యశాఖ లక్ష్యం విధించడంతో వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు వైద్య పరీక్షల కోసం వచ్చిన వారికి కనీసం 5 నిమిషాలు కూడా కేటాయించడం లేదని తెలుస్తోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ప్రజలకు మేలు జరిగే విధంగా ఉందని కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన వారు చెబుతున్నారు.

జిల్లాలో..
కంటి వెలుగు పథకాన్ని ఈ నెల 15 ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పీహెచ్‌సీలలోని వైద్యాధికారుల నేతృత్వంలో 18 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఐదుగురు చొప్పన పనిచేస్తున్నారు. ఈ బృందాలు వారికి కేటాయించిన పట్టణ, గ్రామాలకు వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. దృష్టిలోపం ఉన్నవారికి కళ్లజోళ్లు, అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నారు. దూర దృష్టి లోపం ఉన్నవారికి సంబంధించిన కళ్లజోళ్లు లేకపోవడంతో వాటిని తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రికి, మావలలోని శేషన్న చెన్నవార్‌ ఆస్పత్రికి రెఫరల్‌ చేస్తున్నారు.

జనవరి 26 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లాలో 7 లక్షల 8వేల మందికి కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. ఏడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 20,689 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 9,032 మంది పురుషులు, 11,565 మంది మహిళలు ఉన్నారు. ఇప్పటివరకు 4,357 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 4,768 మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్‌ ఇచ్చారు. శస్త్రచికిత్సల కోసం 2235 మందిని రెఫరల్‌ చేశారు. కంటి పరీక్షల కోసం విద్యార్థులు, చిన్నపిల్లలను తల్లిదండ్రులు ఎక్కువ శాతం మంది పరీక్షలు చేయించడం లేదు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లడం, గురుకులాలు, వసతి గృహల్లో ఉంటూ చదవుకుంటున్న విద్యార్థులు ఈ పరీక్షలకు దూరంగా ఉంటున్నారు. పాఠశాలల్లో కంటి పరీక్షల కార్యక్రమం నిర్వహిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.

వైద్యులకు ఇబ్బందులు
ప్రతి రోజు 300 మందికి కంటి పరీక్షలు చేయాలని లక్ష్యం విధించడంతో వైద్యులు ఇబ్బందులు పడుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. పట్టణంలోని ప్రతి రోజు 350 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యశాఖ ఆదేశాలు జారీ చేయడంతో కొంతమంది వైద్యులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కలెక్టర్‌ రోజుకు 300 వరకు పరీక్షలు చేయాలని సూచించినట్లు పలువురు వైద్యులు చెప్పారు. రోజు 200 మంది లక్ష్యం ఉంటే ప్రజలకు కూడా కంటి పరీక్షలు క్షుణ్ణంగా నిర్వహించే అవకాశం ఉంటుందని, తమకు కూడా పని భారం కొంత తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేదలకు మేలు 
కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా పరీక్షలు, అద్దాలు, ఆపరేషన్‌ చేయడం సంతోషంగా ఉంది. నాకు కంటి సమస్య ఉన్న ప్రైవేటు ఆస్పతికి వెళ్ళేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో పరీక్ష చేయించుకోలేదు. కంటి వెలుగు ద్వారా మా పాప, కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేశారు. – మనోహర్, ఆదిలాబాద్‌ 

స్పందన బాగుంది
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన ఉంది. 18 బృందాలను ఏర్పాటు చేశాం. కంటి సమస్యలు ఉన్న వారికి ఉచితంగా కంటి అద్దాలు, శస్త్రచికిత్సలు ఉన్న వారిని రిమ్స్‌ ఆస్పత్రికి, మావలలోని కంటి ఆస్పత్రికి రెఫరల్‌ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. – రాజీవ్‌రాజ్,  జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి

మరిన్ని వార్తలు