పూర్తయిన డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఎన్నిక

26 Feb, 2020 08:44 IST|Sakshi
డైరెక్టర్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తున్న కొండూరి రవీందర్‌రావు, పక్కన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

డీసీసీబీకి ఏకగ్రీవమైన 15 మంది డైరెక్టర్లు

మరో ఐదు డైరెక్టర్లు పెండింగ్‌లో..

డీసీఎంఎస్‌కు 8 మంది డైరెక్టర్లు ఏకగ్రీవం

ఎస్టీ, ఎస్సీ సొసైటీలు లేక రెండు డైరెక్టర్లు ఖాళీ

29న చైర్మన్ల, కార్యవర్గాల ఎన్నిక

సాక్షి, కరీంనగర్‌ : సహకార ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లుగా టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులు, ప్రాథమికేతర సహకార సంఘాల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి మనోజ్‌కుమార్‌ ఎన్నికైన సభ్యుల జాబితాను ప్రకటించారు. ఎన్నికైన డైరెక్టర్లు ఈ నెల 29న డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌తోపాటు మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకొంటారు. కాగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు కరీంనగర్‌ డీసీసీబీ చైర్మన్‌గా సిట్టింగ్‌ టెస్కాబ్‌ చైర్మన్,  సిరిసిల్ల జిల్లాకు చెందిన కొండూరి రవీందర్‌రావును ఎంపిక చేశారు. వైస్‌ చైర్మన్‌గా జమ్మికుంట మండలం విలాసాగర్‌కు చెందిన పింగిళి రమేష్‌కు అవకాశం దక్కింది. వీరిద్దరిని 29న డీసీఎంఎస్‌ కార్యాలయంలో జరిగే సమావేశంలో డీసీసీబీ నూతన చైర్మన్, వైస్‌ చైర్మన్‌లుగా అధికారికంగా ఎన్నుకుంటారు. డీసీఎంఎస్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్లు ఎవరనేది తేలకపోయినా, ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ముదుగంటి సురేందర్‌రెడ్డి, వీర్ల వెంకటేశ్వర్‌రావులలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. అత్యధిక సొసైటీలు ఉన్న జగిత్యాల జిల్లాకు అవకాశం కల్పించాలని భావిస్తే ధర్మపురి సొసైటీ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, లేని పక్షంలో మిగతా ఇద్దరిలో ఒకరు డీసీఎంఎస్‌ చైర్మన్‌ కానున్నట్లు సమాచారం.

మంత్రి గంగుల నేతృత్వంలో ప్రక్రియ
డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లుగా గ్రూప్‌–ఏ కింద టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు పీఏసీఎస్‌ అధ్యక్షులు పోటీపడ్డారు. అయితే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలనే పాటించారు. మంగళవారం ఉదయం కరీంనగర్‌లోని శ్రీనివాస హోటల్‌లో పీఏసీఎస్‌ అధ్యక్షులతోపాటు ప్రాథమికేతర సొసైటీల అధ్యక్షులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సమావేశం అయ్యారు. టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, పింగళి రమేష్‌లను చైర్మన్, వైస్‌ చైర్మన్‌గా పార్టీ ఎంపిక చేసిన విషయాన్ని ప్రకటించిన మంత్రి డైరెక్టర్లుగా పార్టీ ఎంపిక చేసిన వారి పేర్లను ప్రకటించి, వారితో నామినేషన్లు దాఖలు చేయించారు. గ్రూప్‌–ఏలో 16 మంది నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, 13 మంది మాత్రమే నామినేషన్‌ వేశారు. గ్రూప్‌–బీ నుంచి ప్రాథమికేతర సంఘాల సభ్యులుగా నలుగురికి అవకాశం ఉన్నప్పటికీ, ఇద్దరే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నామినేషన్లు దాఖలు చేసిన 15 మందిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మనోజ్‌కుమార్‌ ప్రకటించారు. మరో ఐదుగురు డైరెక్టర్లను రిజర్వులో పెట్టినట్లు సమాచారం. డీసీఎంఎస్‌ డైరెక్టర్లుగా గ్రూప్‌–ఏ నుంచి ఐదుగురు సభ్యులు, గ్రూప్‌–బీ నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రూప్‌ ఏలో ఎస్టీ, గ్రూప్‌–బీలో ఎస్‌సీలకు చెందిన రెండు డైరెక్టర్లు ఖాళీగా ఉన్నారు. 

అన్ని జిల్లాలకు అవకాశం
డీసీసీబీ చైర్మన్‌గా గజసింగవరం సొసైటీ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు ఎన్నికవుతారని మొదటి నుంచి ఊహించిందే. మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా నుంచి ఆయనకు అవకాశం లభించింది. వైస్‌ చైర్మన్‌గా మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గానికి అవకాశవిుచ్చారు. డైరెక్టర్లుగా పెద్దపల్లి జిల్లా నుంచి సుల్తానాబాద్‌ సింగిల్‌విండ్‌ చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్, ముత్తారం మండలం సర్కారం చైర్మన్‌ గుజ్జుల రాజిరెడ్డికి అవకాశం కల్పించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి ఎల్కతుర్తి సొసైటీ చైర్మన్‌ శ్రీపతి రవీందర్‌గౌడ్‌కు, రాజన్న సిరిసిల్ల నుంచి కొండూరితోపాటు భూపతి సురేందర్, జలగం కిషన్‌రావు, పి.మోహన్‌రెడ్డిలకు అవకాశం లభించింది. కరీంనగర్‌ నుంచి పింగిళి రమేష్‌ వైస్‌ చైర్మన్‌గా, సింగిరెడ్డి స్వామిరెడ్డి డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. జగిత్యాల జిల్లా నుంచి రమేష్‌రెడ్డి, సురేష్‌రెడ్డిలు ఎన్నికయ్యారు. 

డీసీసీబీకి ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లు ...
కొండూరి రవీందర్‌రావు, గుజ్జుల రాజిరెడ్డి, జలగం కిషన్‌రావు, తక్కల్ల సురేష్‌రెడ్డి, దేవరవేని మోహన్‌రావు, పింగిళి రమేష్, మిట్టపల్లి రమేష్‌రెడ్డి, ముప్పాల రాంచందర్‌ రావు, పుచ్చిడి మోహన్‌రెడ్డి, సింగిరెడ్డి స్వామిరెడ్డి, భూపతి సురేందర్‌(ఎస్‌సీ), శ్రీగిరి శ్రీనివాస్‌(బీసీ), శ్రీపతి రవీందర్‌గౌడ్‌(బీసీ), పోరండ్ల కృష్ణప్రసాద్, వీరబత్తిని కమలాకర్‌.
డీసీఎంఎస్‌ డైరెక్టర్లు : అలువాలు కోటయ్య(ఎస్‌సీ), వీర్ల వెంకటేశ్వర్‌రావు (బీసీ), ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఎలిశెట్టి భూమారెడ్డి, ముదుగంటి సురేందర్‌రెడ్డి, మహ్మద్‌ ఫక్రుద్దీన్‌(బీసీ), గాజుల నారాయణ, ఎ.గోవర్థన్‌రెడ్డి. 

కేడీసీసీబీ  డైరెక్టర్లు వీరే..
పింగిళి 
రమేష్‌
ముప్పాల 
రాంచందర్‌రావు
మిట్టపల్లి
రమేష్‌రెడ్డి
భూపతి 
సురేందర్‌
శ్రీగిరి 
శ్రీనివాస్‌
దేవరనేని మోహన్‌రావు
జలగం 
కిషన్‌రావు
శ్రీపతి
రవీందర్‌గౌడ్‌
తక్కళ్ల 
నరేష్‌రెడ్డి
వీరబత్తిని
కమలాకర్‌
వుచ్చిడి 
మోహన్‌రెడ్డి
సింగిరెడ్డి స్వామిరెడ్డి
గుజ్జుల 
రాజిరెడ్డి

మరిన్ని వార్తలు