ఐటీ హబ్‌గా కరీం‘నగరం’

11 Nov, 2017 01:33 IST|Sakshi
ఐటీ టవర్ల నమూనా

రూ.25 కోట్లతో ఐటీ టవర్ల నిర్మాణం 

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఆమోదం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీం‘నగరం’ఐటీ హబ్‌గా మారడానికి అడుగుదూరంలోనే ఉంది. ఇందుకోసం రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిజైన్లు సిద్ధం చేయగా, సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆమోదముద్ర వేశారు. కరీంనగర్‌తోపాటు ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌లకు కూడా ఐటీ టవర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఐఐసీ) టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం టెండర్‌ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. 10 రోజుల్లో టెండర్లు పూర్తిచేసి ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.  

సకల హంగులతో టవర్ల నిర్మాణం.. 
కరీంనగర్‌కు ఐకాన్‌గా ఉండేలా మూడు ఐటీ టవర్‌లను మానేరు డ్యాం సమీపంలోని బైపాస్‌రోడ్డును ఆనుకొని నిర్మాణం చేపట్టనున్నారు. మొదటి దశలో రూ.25 కోట్లతో జీ+5 అంతస్తుల భవనాన్ని 50 వేల చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించనున్నారు. ఇందుకు 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. అత్యాధునిక హంగులతో భవనాల నిర్మాణం పూర్తయితే ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంతో నిరంతర విద్యుత్‌ సరఫరా, హైరేంజ్‌ వైఫై సేవలు, ఇతర సౌకర్యాలన్నీ కల్పించనున్నారు. ఐటీ కంపెనీలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు జరిపితే అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేసుకునే వారికి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.  

కంపెనీల కోసం అమెరికా పర్యటన.. 
ఐటీ కంపెనీలను కరీంనగర్‌కు ఆహ్వానించేందుకు ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ డిసెంబర్‌ 2 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు.

మరిన్ని వార్తలు