తీర్పు నేపథ్యంలో సంయమనం పాటించాలి

5 Nov, 2019 15:53 IST|Sakshi

కరీంనగర్‌ సీపీ కమలాసన్‌ రెడ్డి

సాక్షి, కరీంనగర్‌: రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై తీర్పు రానున్న నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలన్నారు. తీర్పుకు అనుకూలంగా, ప్రతికూలంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని చెప్పారు. ర్యాలీలు, ఊరేగింపులు, టపాసులు కాల్చడం, స్వీట్ల పంపిణీపై నిషేధం విధించినట్లు వెల్లడించారు. సోషల్‌ మీడియాలో తీర్పుపై ఎలాంటి ప్రచారం చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విధుల్లోకి చేరే ఆర్టీసీ కార్మికులకు రక్షణ కల్పిస్తాం..
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలనుకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా రిపోర్ట్‌ చేయవచ్చని పేర్కొన్నారు. విధుల్లో చేరాలనుకునే కార్మికులకు పోలీసులు రక్షణ కల్పిస్తారని తెలిపారు. విధుల్లో చేరే కార్మికులపై బెదిరింపులకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్‌ బాబు అంత్యక్రియల సమయంలో గొడవ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని పీసీ కమలాసన్‌ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు