సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో ప్రజలను మోసం చేసే వారు ఉంటే ప్రజాస్వామ్యానికే పెనుప్రమాదమన్నారు. ప్రజలంతా ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమం జరిగిందని, అది గుర్తించిన సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. అయితే సీఎం కేసీఆర్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రూ.32 వేల కోట్లతో నిర్మించాల్సిన ప్రాజెక్టుల అంచనాలను రూ.లక్షా 20 వేల కోట్లకు పెంచారన్నారు.